Bail For Sharmila : ఓ కానిస్టేబుల్, మరో ఎస్‌ఐపై దాడి చేసిన షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సోమవారం అమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు..  కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో షర్మిల ఉన్నారు. ఒక రోజు  జైల్లో గడపగానే బెయిల్ రావడంతో వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. 


కోర్టు పెట్టిన షరతులు ఇవీ  


రూ. 30వేల పూచీకత్తు ఇద్దరు వ్యక్తులతో ఇప్పించాలని కోర్టు షరతు పెట్టింది. అలాగే విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. షర్మిల నిన్నే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదోపవాదాల తర్వాత కోర్టు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా పోలీసులపై దాడి చేశారు. అయితే పోలీసులు ఆమెపై ఎలాంటి కేసులు పెట్టలేదు. ఆమెపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని..  వైఎస్ఆర్‌టీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి.



సిట్ ఆఫీసును ముట్టడించేందుకు వెళ్తున్నారన్న కారణంగా పోలీసుల హౌస్ అరెస్ట్


టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తనకున్న అనుమానాలను సిట్‌ అధికారులకు వివరించేందుకు బయలు దేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోటస్‌ పాండ్‌ దగ్గర హైడ్రామా కొనసాగింది. పోలీసులకు షర్మిల మధ్య వాగ్వివాదం తోపులాట జిగింది. పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను షర్మిల తోసివేశారు. షర్మిల తనకారును పోలీసులపైకి వెళ్లనీయగా ఓ కానిస్టేబుల్‌ కాలుకు తగిలింది. దీంతో షర్మిలను పోలీసులు అరెస్టు చేసి జూబ్లి హిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఇరుపక్షాల వాదనలు విని రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ఎస్‌ఐ, లేడీ కానిస్టేబుల్‌పై షర్మిల చేయి చేసుకున్నారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ న్యాయమూర్తి ముందు వాదనలు వినింపించారు. షర్మిలను రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తిని కోరారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి షర్మిలకు రిమాండ్‌ విధించారు.


విచారణకు సహకరిస్తామన్న  షర్మిల తరపు లాయర్లు


లోటస్‌ పాండ్‌ వద్ద జరిగిన ఘటనలో షర్మిలపై పోలీసులు 332, 353, 509, 427 ఐపీసీ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. అనంత‌రం కోర్టు వాద‌న‌లో రిమాండ్‌కు పంపకుండా బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తునకు సహకరిస్తామని షర్మిల పక్షాన న్యాయవాది కోర్టుకు విన్నవించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో షర్మిలను పోలీసులు నేరుగా చంచలగూడ జైలుకు తరలించారు. దీంతో ష‌ర్మిల బెయిల్ కోసం నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు.. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి ష‌రతుల‌తో బెయిల్ మంజూరు చేశారు.. దీంతో ఈరోజే ష‌ర్మిల చంచ‌ల్ గూడ జైలు నుంచి విడుద‌ల కానున్నారు.