పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మార్పునకు ముహూర్తం ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే వారంలో ఆయన బీజేపీ అధిష్ఠాంతో సమావేశం కానున్నారని సమాచారం. అనంతరం ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి చేరిక ఉంటుందని తెలంగాణ రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. 


తెలంగాణ రాజకీయాలు సంక్రాంతి తర్వాత మరింత హీటెక్కనున్నాయి. ఖమ్మం వేదికగా అటు బీజేపీ, ఇటు బీఆర్‌ఎస్‌ ఇరు పార్టీలు పోటాపోటీ వ్యూహాలతో రాజకీయాన్ని రక్తికట్టించనున్నాయి. ముందస్తు ఊహాగానాలతో ఇరు పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నాయి.


ఖమ్మం వేదికగా రాజకీయం అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌ పేరు ప్రస్తావన లేకుండా అసలు ముందుకు సాగనే సాగదు. అందుకే ఇప్పుడు ఆయన సెంట్రిక్‌గానే రాజకీయం నడుస్తోంది. ఎప్పటి నుంచో బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న పొంగలేటి ఓ నిర్ణయానికి వచ్చేశారని సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరిపోతారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. 


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఆయన అమిత్‌షాతో భేటీ కానున్నారని సమాచారం. ప్రధానితో కూడా మాట్లాడతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ చర్చల అనంతరం ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి అధికారికంగా కమల దళంలో చేరిపోతారని ఇన్‌ఫర్మేషన్.


ఈ ప్రక్రియ కంటే ముందుగానే అనుచరులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారట పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. మంగళవారం నుంచి అనుచరులతో వరుస భేటీలు ఉంటాయని వారందరికీ ఇప్పటికే సమాచారం ఇచ్చారని కూడా చెప్పుకుంటున్నారు. తనతో వచ్చే వాళ్లెవరూ ఎంతమందితో చేరాలనే అన్ని విషయాలపై క్లారిటీ వచ్చాకే బీజేపీ అధినాయకత్వంతో సమావేశమై చేరికపై స్పష్టత రానుంది. 


ఇప్పటికే ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం కేసీఆర్ సన్నద్ధం అయ్యారు. ఇందుకోసం ప్రణాళిక కూడా సిద్ధం అయిపోయింది. ఈనెల 12వ తేదీన ప్రారంభం కాబోతున్న ఈ పర్యటనలోనే... రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ కూడా నిర్వహించబోతున్నారు. ఈనెల 18వ తేదీ ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దీనికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను ఆహ్వానించారు. కేజ్రీవాల్, భగవంత్ మాన్, అఖిలేష్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. కేరళ ముఖ్యమంత్రి మాత్రం తన నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడించనున్నారు.  


దీంతో ఖమ్మం వేదికగా రాజకీయం వేడెక్కనుంది. అటు ఏపీలో విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్‌... దీన్నో అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలపరచాలన్న సంకల్పంతో ఉన్న చంద్రబాబు ఖమ్మం వేదికగానే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అదే ఊపుతో మరికొన్ని జిల్లాల్లో సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఖమ్మంలో సభ పెట్టిన తర్వాత అదే ఊపుతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో కూడా బహిరంగ సభను నిర్వహించాలని చూస్తున్నారు.