తెలంగాణలో బీజేపీకి అధికారం ఇవ్వాలని, పార్టీ గెలిస్తే సీఎంగా బీసీ వ్యక్తిని నియమిస్తామని బీజేపీ అగ్ర నేత, కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయని అమిత్ షా ప్రశ్నించారు. కుటుంబ పార్టీలు ఎప్పటికీ తెలంగాణను అభివృద్ధి చేయలేవని అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని, రాహుల్ ను ప్రధానిని చేయాలని సోనియా అనుకుంటున్నారని అన్నారు. సూర్యాపేటలో బీజేపీ జనగర్జన సభ నిర్వహించింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.


బీఆర్ఎస్ పార్టీ దళితులు, పేదల వ్యతిరేక పార్టీ అని అన్నారు. పేద వారి కోసం కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా నెలకు 5 కిలోల చొప్పున ప్రతి వ్యక్తికి ఉచిత బియ్యం ఇస్తున్నామని అన్నారు. 


సూర్యాపేటలో రామజన్మ భూమి అంశం లేవనెత్తిన అమిత్ షా
అయోధ్యలో రామజన్మభూమిలో రామ మందిరం నిర్మించాలా వద్దా? 550 ఏళ్ల నుంచి అక్కడ రామ మందిరం నిర్మించాలని పోరాడున్నాం. జనవరి నెలాఖరు నాటికి ఆ ఆలయంలో ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈసారి తెలంగాణలో బీజేపీని గెలిపిస్తారా? మళ్లీ ప్రధానిగా మోదీని గెలిపిస్తారా? కమలం గుర్తుకు ఓటేస్తారా? అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి’’ అని అమిత్ షా తన ప్రసంగాన్ని ముగించారు.


‘‘కేసీఆర్ ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పగలడా? గిరిజనుల అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉంది. వారసులను కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లక్ష్యం. తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమి చేయలేదు. కేటీఆర్ ‌ను సీఎం చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం కోసం ఆలోచిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. ఇటీవలే మంజూరు చేసిన ట్రైబల్ వర్శిటీకి సమ్మక్క - సారక్క పేరును నిర్ణయించాం. ఈ ఘనత నరేంద్ర మోదీ గారికే దక్కుతుంది. కృషా జలాల సమస్య పరిష్కారం కోసం ఇటీవలే కొత్త ట్రిబ్యూనల్ ను ప్రకటించాం. జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంచి నీటిని అందిస్తున్నాం. తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చాం. స్వాతంత్ర్యం సిద్దించాక తొలిసారి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రధాని మోదీ గారు న్యాయం చేశారు. 


అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేసుకుంటున్నా. నరేంద్రమోదీ గారిని మరోసారి ప్రధానిని చేద్దాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరుతున్నాను. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కావాలంటే బీజేపీని గెలిపించాలి’’ అని అమిత్ షా అన్నారు.