Revanth Reddy Visits SLBC Tunnel in Nagarkurnool District | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లా పర్యటనను ముగించుకొని నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చారు. అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట సమీపంలో ఎస్ ఎల్ బి సి టన్నెల్ (SLBC Tunnel) వద్దకు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఫిబ్రవరి 22 నుంచి 8 మంది లోపల చిక్కుకున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లోపల 14వ కిలోమీటర్ వరకు వెళ్లి మరీ మంత్రులతో కలిసి పరిశీలించారు. రెస్క్యూ టీమ్ సిబ్బంది, అధికారులతో మాట్లాడి టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద తీవ్రత వివరాలు అధికారులను అడిగారు. సహాయక చర్యలు జాప్యం కావడానికి తలెత్తిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని బయటకు తీయడానికి ఎంత టైం పడుతుందని వారిని ఆరా తీశారు. ఇలా ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలో ఉన్నతాధికారులు దీనిపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ ఎల్ బి సి టన్నెల్ పరిశీలించిన సమయంలో ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ ఎంపీలు, జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ ఘటన పాపం బీఆర్ఎస్ వారిదే..

ఎస్ఎల్‌బీసీ పాపం బీఆర్ఎస్ ప్రభుత్వానిదే, కేసీఆర్ దేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై సవతి తల్లి ప్రేమ చూపించారని వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఆరోపించారు. పదేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ మిగతా పనులు పూర్తి చేయని పాపం కేసీఆర్ దే అని, 8 మంది టన్నెల్ లోపల చిక్కుకుపోవడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం రాయలసీమకు తీసుకుపోతుంటే చూస్తూ కూర్చున్నారని విమర్శించారు.

Also Read: Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన