Principal Rupa Reddy Murder Case: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. జల్సాలకు అలవాటుపడిన ఇద్దరు మైనర్ విద్యార్థులు, స్కూల్ ఫీజుల వసూళ్లు జరుగుతున్నందున ఇంట్లో నగదు ఉంటుందని భావించి 5 రోజుల ముందే ఈ చోరీకి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇంట్లోకి ప్రవేశించిన విద్యార్థిని ప్రిన్సిపల్ గుర్తుపట్టడంతో, ఆమె బాబు అని పిలిచ్చారు. తమ వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను దారుణంగా హత్య చేసి డబ్బుతో పరారయ్యారని ఎస్పీ తెలిపారు.

Continues below advertisement

నిందితులను పట్టించిన ఒక్క మాట..ఈ కేసును ఛేదించడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పాత నేరస్థులు, సైకోల కోణంలో విచారణ చేపట్టారు. సుమారు 70 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కదలికలను గుర్తించారు. రూపారెడ్డి చివరిసారిగా తన పిన్నితో ఫోన్లో మాట్లాడుతూ "బాబు" అని అనడంతో, పాఠశాల విద్యార్థులపై ఫోకస్ చేశారు. అదే విషయం దర్యాప్తులో పోలీసులకు కలిసొచ్చింది. హత్య అనంతరం నాలుగు రోజులు స్కూలుకు సెలవు ఇవ్వగా, పాఠశాల రీఓపెన్ అయిన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థుల వివరాలను ఆరా తీశారు. అందులోని ఐదుగురు పదో తరగతి విద్యార్థుల్లో ఇద్దరు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఒకరి వద్ద దొరికిన రూ. 1.54 లక్షల నగదుపై ఉన్న మరకలను ల్యాబ్‌కు పంపగా అది మనిషి రక్తంగా నిర్ధారణ అయింది.

డబ్బు, సెల్‌ఫోన్‌తో పట్టుకోవడంతో పగ పెంచుకున్న విద్యార్థి.. నిందితుల్లో ఒక విద్యార్థి గతంలో హాస్టల్‌లో ఉన్నప్పుడు బ్యాగ్‌లో డబ్బు, సెల్‌ఫోన్ దొరకడంతో రూపారెడ్డి, ఉపాధ్యాయులు అతడిని తల్లిదండ్రుల ముందే మందలించి డేస్కాలర్‌గా మార్చారు. దీంతో ఆ విద్యార్థి ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్నాడు. మద్యం, బైక్‌ల మోజు ఉన్న అతడు నెల కిందట గోవా టూర్ సైతం వెళ్లాడని గుర్తించారు. డబ్బు కోసం ఐదు రోజుల ముందే చోరీకి ప్లాన్ చేసుకుని సీసీ కెమెరాలు, తమకు అనుకూలమైన టైం పరిశీలించారు. ఈనెల 11న స్కూల్ ముగిశాక ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంటికి వెళ్లి, ఒకడు మాస్క్ ధరించి గోడ దూకి లోపలికి వెళ్లాడు. అయితే కంగారులో మాస్క్ ఊడిపోవడంతో ప్రిన్సిపల్ అతడిని గుర్తుపట్టింది. దీంతో కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. మొత్తం 27 సార్లు పొడిచి దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి లక్షన్నర నగదుతో పాటు ఐఫోన్, రూపారెడ్డి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరుస్తున్నామని ఎస్పీ వివరించారు.

Continues below advertisement