Munugode Bypolls: మునుగోడు ఉప ఎన్నికలకు అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ నాయకత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ సైతం ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. వీరంతా ఇప్పుడు మునుగోడులో మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్, ఉప ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి రావాలని టీఆర్‌ఎస్‌ పార్టీ, తెలంగాణలో తన సత్తా చాటేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాదించాలని బీజేపీ పార్టీ భావిస్తుండటంతో మునుగోడులో భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మునుగోడులోనే ఉంటూ క్యాంపెయినింగ్‌ చేస్తున్నారు
వంద మందికో ఇన్‌ఛార్జ్..
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ సారి తన వ్యూహాన్ని మార్చింది. మునుగోడు (Munugode By Elections) స్థానాన్ని మరోమారు కైవసం చేసుకునేందుకు పక్కడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఇందుకోసం మంత్రులను మండల ఇన్‌ఛార్జ్‌లుగా, ఎమ్మెల్యేలను గ్రామస్థాయి ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. దీంతోపాటు సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిలర్, కార్పోరేట్‌ స్థాయి నాయకులను కూడా ప్రచారంలో బాగస్వామ్యం చేస్తుంది. ప్రతి వంద మంది ఓటర్లకు ఓ ఇన్‌ఛార్జ్‌ను నియమించి ప్రచారం ముగిసే వరకు వారితో మమేకం కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్గొండతోపాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మునుగోడుకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం నగరానికి చెందిన కార్పోరేటర్లు మునుగోడుకు తరలివెళ్లగా ఎంపీటీసీ, సర్పంచ్‌లు సైతం మునుగోడుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 
రాష్ట్ర నాయకత్వంతోపాటు కేంద్రమంత్రులు..
తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాదించాలని భావిస్తున్న బీజేపీ పార్టీ అన్ని అస్త్రాలను ఉపయోగిస్తుంది . ఇప్పటికే రాష్ట్ర పార్టీకి చెందిన కీలక నాయకులు మునుగోడులో తిష్టవేయగా కేంద్ర మంత్రులను తరచూ ప్రచారానికి దించుతూ తమ సత్తాను చాటేందుకు సిద్దమవుతుంది. ఎన్నికల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ అందుకు కావాల్సిన వ్యూహాన్ని మార్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర మంత్రులు నేరుగా ప్రచారంలో పాల్గొననుండటంతో ఇటు ప్రోటోకాల్‌ ఇబ్బందులు కూడా ఉండవని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా వీలైనంత మంది మంత్రులను ప్రచారంలో భాగస్వాములుగా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చేరికలపైనే బీజేపీ ప్రధానంగా దృష్టి సారించడం గమనార్హం. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ సైతం తన సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల నియమితులైన టీపీసీసీ మెంబర్లతోపాటు రాష్ట్ర నాయకత్వం పూర్తిగా మునుగోడులో ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఓటరును కలిసి వారిని తమవైపు తిప్పుకునేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం రచించింది. సానుభూతి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుని మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాదించాలని భావిస్తున్నట్లు చూస్తుంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికలకు అటు ప్రజా ప్రతినిధులతోపాటు నాయకులు సైతం అక్కడే తిష్ట వేయడంతో వారిని కలవాలంటే అక్కడికే వెళ్లాలని ప్రజలు బావిస్తున్నారు.