మూడు నెలల వెయిటింగ్‌.. మూడుసార్లు రద్దు.. ఇది ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన షెడ్యూల్‌.. మూడు సార్లు రదై్దన పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. దీంతో కేటీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి. అయితే ఖమ్మం గులాబీలో అసంతృప్తులు అధికమైన నేపథ్యంలో కేటీఆర్‌ టూర్‌లో ఎవరెవరు మెరుస్తారో.. ఎవరెవరు ముఖం చాటేస్తారు..? అనే విషయం ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది.


గత కొద్ది కాలంగా రాజకీయ వేడిన పుట్టించిన ఖమ్మం నగరంలో కేటీఆర్‌ పర్యటన ద్వారా తన మార్కు అబివృద్ధిని చూపించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తాపత్రయ పడుతున్నారు. గతంలో మూడుసార్లు అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు కాగా బీజేపీ కార్యకర్త సాయి ఆత్మహత్య ఉదంతం ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడిన పుట్టించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ పర్యటన రదై్దనట్లు వార్తలు వినిపించాయి. అప్పట్నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలకు పదును పెట్టారు. అయితే వాటన్నింటికి అభివృద్దితోనే సమాదానం చేప్పాలనే బావనతో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.


ఈ నేపథ్యంలో ప్రత్యర్థుల విమర్శలకు అభివృద్ధి పనులతో దీటైన సమాదానం ఇవ్వాలనే భావనతో ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కేటీఆర్‌ పర్యటన సందర్భంగా ఖమ్మం నగరాన్ని గులాభీ మయంగా మార్చేశారు. కేవలం ఖమ్మం నియోజకవర్గంలోనే మంత్రి కేటీఆర్‌ పర్యటన ఉండటం గమనార్హం. అయితే ఇటీవల ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీలో అసంతృప్తుల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో కేటీఆర్‌ పర్యటనసై ఆసక్తి నెలకొంది.


మాజీ మంత్రితో తుమ్మలతో కేటీఆర్‌ భేటీ రహస్యమిదేనా..?
కేటీఆర్‌ ఖమ్మం పర్యటన నేపథ్యంలో ముందస్తుగానే అసంతృప్త నాయకులతో చర్చలు జరిపి తన పర్యటన ద్వారా అంతా సవ్యంగానే ఉందని చెప్పకనే చెప్పాలని బావించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో పాలేరులో వరుస పర్యటనలు చేస్తూ తన మాటలతో సంచలనాలు చేస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో కలవడం సుమారు గంటపాటు సుదీర్ఘంగా చర్చించడం చూస్తే వివాదాలకు చెక్‌ పెట్టే వ్యూహాంలో బాగంగానే తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం జిల్లాలో తన పర్యటనలతో దూకుడు పెంచారు. వీరితోపాటు మరికొంత మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంతృప్త నేతలుగా ఉన్నారు. అయితే మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఎవరు మెరుస్తారు..? ఎవరు ముఖం చాటేస్తారు..? అనే విషయం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది.