Komatireddy Venkat Reddy in Nalgonda: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గురించి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం రెండు సీట్లు గెలిచినా తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘవీర్‌ రెడ్డి నామినేషన్‌ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన రోడ్డు షోలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్ నేడు ఏ ముఖం పెట్టుకుని మిర్యాలగూడకి వస్తున్నారని నిలదీశారు.


కేసీఆర్ దమ్ముంటే తన ఛాలెంజ్‌లు స్వీకరించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. ఇక కారు షెడ్డుకేనని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు వస్తున్న కేసీఆర్ కు సిగ్గు ఉండాలని ఘాటుగా మాట్లాడారు. నల్గొండ పార్లమెంట్‌లో మనకు పోటీ ఎవరు లేరని, ఇప్పటికే గెలుపు ఖాయం అయిందని అన్నారు. మెజార్టీ కోసమే మనం కాస్త కష్టపడాలని కోమటిరెడ్డి అన్నారు.