Gutha Sukender Reddy: టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఖండించారు. కుటుంబ పాలన గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయనకు తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భార్య కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వారిది కూడా కుటుంబ పాలనే అని నల్గొండ క్యాంపు కార్యాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చిట్ లో పలు విషయాలపై మాట్లాడారు. స్వార్ధ ప్రయోజనాల కోసం మాత్రమే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని విమర్శించారు. 


కావాలనే రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించారు.. 
కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని గుత్తా సుఖేందర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా బీజేపీకి అవసరం అని... ఆ పార్టీ ఒత్తిడి చేయడం వల్లే ఆయన రాజీనామా చేశారంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణలో రాజకీయ విస్తరణ కోసమే బీజేపీ రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించిందని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం అని జోస్యం చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లతో తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టమని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై తాజాగా బీజేపీలో చేరిన దాసోజ్ శ్రావణ్ చేసిన వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయని తెలిపారు. చాలా రాష్ట్రాలలో ప్రజలకు తినడానికి సరైన తిండి కూడా దొరకడం లేదన్నారు. అలాంటి సమస్యలను వదిలి పెట్టి.. ప్రధాని నరేంద్ర మోదీ ఇతర అంశాల దృష్టి పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాటి నుండి దృష్టి మళ్లించేందుకే వివిధ రాష్ట్రాలలో రాజకీయ అనైతిక వాతావరణం సృష్టిస్తున్నారని గుత్తా సుఖేందర్ ఆరోపించారు. 


టీఆర్ఎస్‌దే విజయం.. 
మునుగోడు ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో  అధికారంలో ఉన్న పార్టీ.. టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. మునుగోడులో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అసలు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందో రాజగోపాల్ రెడ్డి క్లారిటీగా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటి నుండి అలవాటేనని దుయ్యబట్టారు. గతంలో రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్ నేతలు ఎవరూ మద్దతివ్వలేదని గుర్తు చేశారు. తాను, జానారెడ్డి కలిసి మిగతా నేతలందర్నీ కన్విన్స్ చేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించామన్నారు. 


కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసం పోటీ.. 
బీజేపీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరుని గుత్తా సుఖేందర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవనని రాజగోపాల్ రెడ్డికి కూడా తెలుసునంటూ కామెంట్లు చేశారు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయన్నారు. మునుగొడులో పోటీ చేయాలని ఎవరు నన్ను అడగలేదని.. ఒకవేళ అడిగితే అప్పుడు ఆలోచిస్తానని తన మనసులోని మాట తెలిపారు. ప్రస్తుతం తాను శాసన మండలి ఛైర్మన్ హోదాలో సంతృప్తిగా ఉన్నానని వివరించారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం కలిగిన వాళ్లని... అధికారంలో ఉన్న పార్టీతోనే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని వాళ్లకు తెలుసన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే గా ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.