ఉదయం బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ బీజేపీపై సీరియస్ కామెంట్స్ చేశారు. 


భారతీయ జనతా పార్టీ ఒక విష సంస్కృతికి తెరతీసిందన్నారు. మునుగోడు ప్రజలను ధనమదంతో గెలవాలన్న కుటిల ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఏ సంకల్పంతోనైతే ఫ్లోరోసిస్ సమస్యను, మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను, సాగునీటి ప్రాజెక్టులను, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లామో అదే సంకల్పంతో మరింత ముందుకు పోతామన్నారు.  


ఎన్నికల్లో ప్రజాబలంతో గెలవలేక రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకొని బీజేపీ శిఖండి రాజకీయాలను చేస్తోందని మండిపడ్డారు కేటీఆర్. భారతీయ జనతా పార్టీ ఒక నీతి జాతి లేని పార్టీ అంటూ కామెంట్స్‌ చేశారు. నల్లగొండ ప్రజలు ఏ విధంగా అయితే హుజూర్నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ పార్టీకి గెలుపును కట్టపెట్టారో అదే ఫలితం మునుగోడులో పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవిష్యత్తుపై ప్రభావం చూపించే ఈ ఎన్నికల్లో మంచి నిర్ణయం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాని అన్నారు. 


అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాస్ సిలిండర్ ధర, గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో అత్యంత కింది స్థానానికి దేశాన్ని పడేసిన ప్రధానమంత్రి, ఆయన పార్టీ బిజెపికి బుద్ధి చెప్పాలని కోరుతున్నాను అన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విమర్శించి అర్హత కిషన్ రెడ్డికి ఏమాత్రం లేదని విమర్శించారు. ఆయన ఒక నిస్సహాయ మంత్రి అంటూ ఎద్దేవా చేశారు. కెసిఆర్‌ను తిట్టినంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడవన్నారు. 


ప్రజలకు మంచి పనులు చేస్తే, వాటిని చెప్తే ఓట్లు వేస్తారన్నారు కేటీఆర్. ధైర్యంగా కరోనా వ్యాక్సిని కనిపెట్టిన ప్రధాని అన్న అమాయకుడు కిషన్ రెడ్డి అని సెటైర్లు వేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాలేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ అయితే కిషన్ రెడ్డి సీతాఫల్మండిలో నాలుగు లిఫ్టులను కేంద్రం నుంచి తెచ్చారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి కనీసం రాసిచ్చిన స్క్రిప్ట్ కూడా చదివే తెలివి లేదన్నారు. 


బీజేపీకి దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణకి ఏం తెచ్చారో ప్రజలకు చెప్పి మునుగోడులో ఓటు అడగాలని సవాల్ చేశారు కేటీఆర్. 2016లో నడ్డా అనే అడ్డమైన వ్యక్తి మర్రిగూడలో పెడతామన్న కరోనా రీసెర్చ్ సెంటర్, హాస్పిటల్స్ సంగతి ఏమైందో చెప్పాలన్నారు. కేంద్ర రాజ్యాంగ సంస్థలన్ని బిజెపి చేతిలో కీళ్లు బొమ్మలుగా మారాయన్నారు. ఇవన్నీ కూడా బిజెపికి అనుబంధ సంఘాలుగా పేర్లు మార్చుకుంటే మంచిగా ఉంటుందన్నారు. 


తెలంగాణ ప్రభుత్వ పనితీరు వలన ఫ్లోరోసిస్ సమస్య అంతమైందని... ఫ్లోరోసిస్ బాధిత గ్రామాలు లేవని కేంద్రమే చెప్పిందన్నారు. ఇందుకు కారణమైన మిషన్ భగీరథకు నిధులు ఇవ్వమని నీతి అయోగ్ చెప్తే 18 వేల కోట్లు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిందన్నారు. కానీ ఫ్లోరోసిస్ సమస్య కోసం 18 రూపాయలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి చిన్న కంపెనీకి ఇంత పెద్ద కాంట్రాక్టులు ఎట్లా వస్తున్నాయో చెప్పాలన్నారు కేటీఆర్. ఇందులో దాగిన గుజరాత్ గూడుపుఠాని ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.


కోమటిరెడ్డి సోదరులు చేస్తుంది కోవర్ట్ రాజకీయం కాదా అని నిలదీశారు కేటీఆర్. బిజెపి కాంగ్రెస్‌ కలిసి కుట్రజేస్తుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజలను తమ అబద్ధాలు అసత్యాలతో లోబర్చుకొని గెలుస్తామంటే ప్రజలు అమాయకులు కాదన్నారు. కర్ణాటక, గుజరాత్‌లో 3000 వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనిదే తెలంగాణలో ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలుంటాయన్న సామెతను బూర నర్సయ్య నిజం చేస్తున్నారని... ఆయన గ్రహచారం బాగాలేదు...అందుకే పార్టీ మారారన్నారు. 


అటల్ బిహారీ వాజ్‌పేయీ టేబుల్‌ నుంచి ఫ్లోరోసిస్ బాధితుల నుంచి ఒక్క పైసా రాలేదని... కనీసం మోడీ అయినా ఫ్లోరోసిస్ బాధ్యులకు  పైసలు ఇచ్చారా అని నిలదీశారు కేటీఆర్. మునుగోడులో ఉన్న ఓటర్లలో 99.15 శాతం మందికి తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి జరుగుతోందన్నారు. చేసిన పనులు చెప్పి బరాబర్ ఓట్లు అడుగుతామన్న కేటీఆర్‌... ప్రధానమంత్రి వ్యాక్సిన్ కనిపెట్టారు, 3000 పెన్షన్ ఇస్తాం వంటి అబద్ధాలు చెప్పకుండా, చేసిన పని చెప్పాలని బీజేపీకి సవాల్ చేశారు. 


దేశ చరిత్రలో తొలిసారి చేనేతపై పన్నువేసి చేనేతలకు మరణ శాసనం రాసింది మోదీ అని విమర్శించారు కేటీఆర్. అవసరమైతే రైతు బంధువు తీసుకుంటున్న కోమటిరెడ్డి సోదరులను కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు వేయమని అడుగుతామన్నారు. 
 
కోమటిరెడ్డి బ్రదర్స్ కాదు వాళ్ళు కోవర్ట్ బ్రదర్స్ అని మండిపడ్డారు భిక్షమయ్యగౌడ్. డబ్బులతోనే రాజకీయం చేయొచ్చని నలగొండ రాజకీయాలను భ్రష్టు పట్టించారన్నారు. ఒకాయన కాంగ్రెస్‌లో ఉండి బిజెపికి పని చేస్తారు... ఇంకొక ఆయన 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం పార్టీ మారారన్నారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా అంతం చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌కి నల్గొండ జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. 18 వేల కోట్ల రూపాయల కోసం మునుగోడు ఆమ్ముకున్నారని... మళ్ళీ గెలిస్తే లక్ష కోట్లకు నల్గొండను అమ్ముకుంటారన్నారు. 


దేశం కోసం ధర్మం కోసం అనే బిజెపి... ఒక బ్రోకర్‌ను, రాజకీయ కాంట్రాక్టర్‌ను ఎందుకు పార్టీలో చేర్చుకుందని ప్రశ్నించారు భిక్షమయ్య గౌడ్‌. ఈ బ్రోకర్ బ్రదర్స్‌కి బుద్ధి చెప్పేందుకు తామంతా టీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసి ఉపఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు.