ABP  WhatsApp

KCR Speech: ఢిల్లీ బ్రోకర్లు చంచల్ గూడ జైల్లో ఉన్నరు, మనోళ్లు ఎడమకాలు చెప్పుతో కొట్టిన్రు - కేసీఆర్

ABP Desam Updated at: 30 Oct 2022 04:48 PM (IST)

మునుగోడు నియోజకర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.

మునుగోడు సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్

NEXT PREV

ఇటీవల ఫాంహౌజ్ లో జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేలను అంగట్లో సరకు మాదిరిగా కొనాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. వారి ప్రయత్నాలను మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎడమకాలి చెప్పుతో కొట్టారని నలుగురు ఎమ్మెల్యేలను ప్రశంసించారు. మునుగోడు నియోజకర్గంలోని చండూరు మండలం బంగారిగడ్డ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించింది. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు.


‘‘హైదరాబాద్ నుంచి నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నాతో పాటు వచ్చారు. నిన్నా మొన్నా ఢిల్లీ బ్రోకర్ గాళ్లు పార్టీ మారాలని వంద కోట్లు ఇస్తే వారిని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. మేం అమ్ముడు పోబోమని, తెలంగాణ బిడ్డలమని, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాలంత ఎత్తు ఎగరేశారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్, కొత్తగూడెం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు లాంటివారు మన రాజకీయాలకు కావాలి. జాతి, దేశ గౌరవాన్ని కాపాడారు. అంగట్లో పశువుల్లాగా అమ్ముడుపోకుండా రూ.వంద కోట్లిచ్చినా గడ్డిపోచగా విసిరికొట్టారు.


సంతలో పశువుల్లా కొనబోయారు - సీఎం


ఇతరుల్ని సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూలగొడుతున్న అరాచకం ప్రస్తుతం ఉంది. మోదీ రెండు సార్లు ప్రధానిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ కు వచ్చి ఇప్పుడు చంచల్ గూడ జైలులో ఉన్నారు. దీనిపైన విచారణ జరగాలి. మనం మౌనంగా ఉంటే అదే మనకు శాపం అవుతుంది. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. కాబట్టి, మునుగోడులో ఉన్న అందరూ మనసుపెట్టి ఆలోచించండి. మీ ఊరు పోయి చర్చించుకోండి.



గమ్మత్తేందంటే గాయి గాయి గత్తర గత్తర.. ఢిల్లీ వచ్చి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిరి.. ఇప్పుడు జైల్లో ఉండిరి. ఎవడో తలమాసినోడు వచ్చి తడి బట్టలతో ప్రమాణం చేత్తవా? ఇంకోడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేత్తవా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నరు.. నేను రాజ్యాంగ బద్ధ సీఎం పదవిలో ఉన్నా. కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలే. మీరు టీవీలో చూసింది గింతే.. దొరికిన దొంగ గింతున్నది. ఢిల్లీ పీఠమే దుమ్ము రేగే పరిస్థితి ఉంది. ఈ దుర్మార్గులను కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో ఇసిరేస్తే తప్ప దేశానికి విముక్తి లేదు. మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ప్రభుత్వాన్ని కూలగొట్టేవాలను తన్ని తరిమేస్తే గానీ, దేశం బాగుపడదు- కేసీఆర్


మీటర్లు పెట్టేవాడికే మీటర్లు పెట్టాలె - కేసీఆర్


దేశంలో ఏ ప్రధాన మంత్రి కూడా చేయని పని ప్రధాని మోదీ చేస్తుండు. చేనేత కార్మికులకు 5 శాతం జీఎస్టీ విధిస్తున్నరు. చేనేత కార్మికులందరూ కలిసికట్టుగా ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయకండి. మన వేలితోనే మన కంటిని పొడుచుకుంటామా? వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడమే కాదు.. ఇళ్లలో ఉన్న మీటర్లను కూడా రూ.30 వేలు పెట్టి మార్చుకోవాలట. దయచేసి అందరూ ఆలోచించండి. కేసీఆర్ చెప్తున్నడు కదా.. సభలో చెయ్యి ఊపుడు కాదు.. దయచేసి ఆలోచన చెయ్యాలె. మీటర్లు పెట్టుకొని ఉన్న కొంపలు ఆర్పుకుందామా? మీటర్లు పెడతా అన్నోడికే మీటర్లు పెడదామా? ఆలోచన లేకపోతే ఎన్నికల్లో జరిగే దుర్మార్గమైన ప్రలోభాలకు ఆశపడితే మనం గోస పడతం’’ అని కేసీఆర్ అన్నారు.

Published at: 30 Oct 2022 04:34 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.