తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మునుగోడు ఉప ఎన్నికలను లిట్మస్ టెస్ట్‌గా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారిదే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అంటూ, ఇక్కడి నుంచే జైత్రయాత్ర ప్రారంభిస్తామని బీజేపీ, కాంగ్రెస్ చెబుతున్నాయి. మునుగోడు ప్రజలు అధికార టీఆర్ఎస్ పథకాలకు ఓట్లు వేస్తారని సీఎం కేసీఆర్ దీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరి కారణంగా ఉప ఎన్నికలు వచ్చాయో, ఆ నేతకు ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదో చోట షాకులిస్తున్నారు ప్రజలు.


మునుగోడు ఉపఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మరోసారి గెలుపొందాలని బీజేపీ తరఫున రాజగోపాల్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా ప్రచారం చేస్తున్న ఆయనకు నారాయణపురం మండలంలోని గుజ్జగ్రామంలో ప్రజలు షాక్ ఇచ్చారు. తమ గ్రామంలోకి రావద్దని నినాదాలు చేశారు. గో బ్యాక్ రాజ్ గోపాల్ రెడ్డి అంటూ అడ్డగించారు. అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి అంటు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మొన్న ఆల్లాపురం,నిన్న సోలి పురం, ఇవాళ గుజ్జ గ్రామం ప్రజలు రాజగోపాల్‌ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్నారు. 


మునుగోడు నియోజకవర్గంలో మరోసారి పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల పరిధిలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మరోసారి పోస్టర్లు దర్శనమిచ్చాయి. మేం మోసపోయాం. మీరు మోసపోవద్దు మునుగోడు ప్రజలారా అంటూ అంటూ దుబ్బాక, హుజూరాబాద్ ప్రజల పేరుతో చౌటుప్పల్‌లో ఈ పోస్టర్లు ఏర్పాటు చేశారు. షా ప్రొడక్షన్స్ సమర్పించు. 18 వేల కోట్లు... దర్శకత్వం కోవర్ట్ రెడ్డి.. సత్యనారాయణ 70 ఎం.ఎం అంటూ నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. మరోవైపు ప్రతిరోజూ ఏదో ఓ గ్రామంలో రాజగోపాల్ రెడ్డిని ప్రజలు అడ్డుకుంటూ నిలదీస్తున్నారు.