Yadadri Thermal Power Station: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులను పూర్తి చేసే విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అందుకే దాని ప్రాజెక్టు వ్యయం కూడా విపరీతంగా పెరిగిపోయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల్లో వేగం పెంచి యూనిట్ 2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.


‘‘8.2.2015 న పవర్ ప్లాంట్ పనులకు పునాది పడింది. 17.10.2015 న పనులు మొదలుపెట్టారు. 2020 అక్టోబర్లో రెండు యూనిట్లు 2021లో మిగిలిన మూడు యూనిట్లు పూర్తి చేయాలని గత ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనుకున్న సమయానికి అందించకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడింది. ప్రాజెక్టును అనుకున్న కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా కూడా నాటి ప్రభుత్వం చిత్తశుద్ధి లోపం, నిత్యం సమీక్షలు లేకపోవడం మూలంగా ఆర్థిక భారం పెరిగింది.


ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చేనాటికి పవర్ ప్రాజెక్టు అనుమతులు నిరాకరణకు గురయ్యాయి. 50 శాతం విదేశీ బొగ్గు మరో 50 శాతం స్వదేశీ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఎన్‌జీటీకి చెప్పారు. కాలక్రమంలో నాటి ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవడంతో పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు. ఫలితంగా అనుమతులు సస్పెండ్ అయ్యాయి. అప్పుడే ఎన్జీటీకి నాటి ప్రభుత్వం సమాచారం ఇచ్చి ఉంటే ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగి ఉండేది కాదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ఎన్జీటీకి కావలసిన పబ్లిక్ హియరింగ్ ను గత ఫిబ్రవరిలో చేపట్టాం. జూలైలో ఈసీ క్లియరెన్స్ తెచ్చాం.


మేము అధికారంలోకి వచ్చాక నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. వారానికి ఒకసారి సమీక్ష చేపట్టాం. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వారం వారం.. క్యాలెండర్ ఖరారు చేసాం. 31 మార్చి 2025 నాటికి 4 వేల మెగావాట్ల ఉత్పత్తి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకున్నాం. రోడ్లు, రైల్వే, సివిల్ పనులు సైతం పూర్తిచేయాలని నిర్ణయించాం. మొత్తం ఐదు యూనిట్లలో మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్లను ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగిలిన రెండు యూనిట్లు 2025 మార్చికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తాం. 


ప్రాజెక్టు పూర్తయ్యాక ఖర్చు మొత్తం లెక్క కట్టి యూనిట్ ధర ఎంత అవుతుంది అనేది ఈఆర్సీ నిర్ణయిస్తుంది. మా లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి యూనిట్ ధర రూ.6.35 రూపాయలుగా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇది రాష్ట్ర ప్రజల సంపద, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచడానికి విద్యుత్ అవసరాలు తీర్చడానికి ఓ ఉన్నత కార్యక్రమం ఇది. భూ నిర్వాసితులు గొప్ప త్యాగధనులు. భూ సేకరణ పరిహారం చెల్లించడంతోపాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. భూ నిర్వాసితుల విషయంలో అందరి ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటాం’’ అని భట్టి విక్రమార్క అన్నారు.