Road Accidents In Suryapet and Warangal: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన రెండు ప్రమాదాల్లో పది మంది మృతి చెందారు. సూర్యపేట జిల్లా, వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. 


హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు సూర్యపేట జిల్లా కోదాడ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోదాడ సమీపంలో దుర్గాపురం స్టేజి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. విజయవాడ వెళ్తున్న కారు ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నందునే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. 


మరో ప్రమాదం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. ఆకేరు వాగు వంతెన వద్ద రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. నలుగురు కలిసి ఓ బైక్‌పై వెళ్తున్న టైంలో ప్రమాదం జరిగింది. నలుగురు విద్యార్థులు ఒకే బైక్‌పై ఇల్లందు నుంచి వర్ధన్నపేట వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. 


ఈ బస్సు ఎన్నికల ప్రచారం ముగించుకొని ఖాళీగా వెళ్తున్న టైంలో ప్రమాదం జరిగింది. బస్సు ఢీ కొట్టిన దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు స్పాట్‌లోనే చనిపోగా... మరో విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించామన్న ఆనందంలో పార్టీ చేసుకునేందకు వెళ్తున్న టైంలో ఘోరం జరిగిపోయింది. 


ఈ ప్రమాదంతో ఆయా ఫ్యామిలీల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీళ్లంతా తల్లిదండ్రులకు ఒకే ఒక్క బిడ్డలు. ముగ్గురు ఇల్లందు గ్రామానికి చెందిన వారు కాగా... మరొకరు వర్ధన్నపేటకు చెందిన వారు. రెండు వాహనాలు ఎదురెదురుగా వేగంగా దూసుకురావడంతోనే పెను ప్రమాదం జరిగిందని... అక్కడ ఉన్న మలుపు కూడా ప్రమాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు పోలీసులు. 


హైదరాబాద్‌లో వ్యక్తి సజీవదహనం 


హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. పటాన్ చెరు సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. స్పాట్‌లోనే ఆ కారు దగ్దమైపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా... అందులో ఉన్న వ్యక్తి  సజీవ దహనమైనట్టు గుర్తించారు.