నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ బారీ ఆసుపత్రిలో చేరాడు. జైల్లో ఉన్న అతనికి ఈ ఉదయం గుండెపోటు రావడంతో జైలు అధికారులు ఆసుపత్రిలో చేర్చారు. 


ఉదయం లేచిన వెంటనే గుండెల్లో నొప్పి ఉందని అబ్దుల్‌ బారీ జైలు సిబ్బందికి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతనికి పరీక్షలు చేశారు. అక్కడి నుంచి  వెంటనే నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు చికిత్స చేస్తున్నారు. 


2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ప్రణయ్‌ హత్య. ఈ హత్య కేసులో అమృత తండ్రి మారుతీ రావుకు సహాయం చేసింది అబ్దుల్‌ బారీ. ఆయనకు సుపారీ గ్యాంగ్‌ను సమకూర్చి హెల్ప్ చేశాడు. ప్రస్తుతం నల్గొండ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2018 సెప్టెంబర్‌లో ప్రణయ్‌ను నడిరోడ్డుపై దారుణంగా హత్యచేశాడు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీ రావు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.


తన మాట కాదని తన కుమార్తె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కక్షతో మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేశాడు. ఈ కేసులో అమృత తండ్రి మారుతీరావు, ఆమె బాబాయి శ్రవణ్, ఎంఏ కరీం, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, సుభాష్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడు మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగిన చనిపోయాడు.