Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనీ కేసులతో వేధిస్తుంటే అండగా ఉండాల్సిన టైంలో కాంట్రాక్ట్ ఒప్పందాల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జంప్ అయ్యారని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను ఒకసారి మోసం చేసిన వ్యక్తి మరోసారి మోసం చేయడని గ్యారెంటీ ఏంటని రేవంత్ ప్రశ్నించారు. గతంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారన్నారు. వారి త్యాగాలు రాజగోపాల్ రెడ్డి ఎందుకు గుర్తులేదవని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలోని చుండూరులో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేశారు.  


అమిత్ షా జైలుకు వెళ్లలేదా? 


బీజేపీలోకి ఎందుకు వెళ్లారో రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల రోజులు జైల్లో ఉన్న తన నాయకత్వంలో పనిచేయలేని వ్యక్తి 90 రోజులు జైల్లో ఉన్న అమిత్‌షాతో ఎలా పనిచేస్తారో సమాధానం చెప్పాలన్నారు. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి మోదీ, అమిత్ షాను అడిగి నిధులు తీసుకొస్తారా అని ప్రశ్నించారు. కష్టకాలంలో ఉన్న పార్టీకి అండగా ఉండాల్సిన టైంలో పార్టీకి ద్రోహం చేసి వెళ్లినపోయిన రాజ్‌గోపాల్‌కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఒక్క ఎమ్మెల్యే పోయినంత మాత్రాన కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదన్నారు.  






టీఆర్ఎస్ 120 కేసులు పెట్టింది 


2014 నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీ తనపై 120 కేసులు పెట్టిందని అయినా భయపడకుండా నిలబడ్డానని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడించే వరకు పోరాటం చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న బాధ లేదన్నారు. ప్రజల సంక్షేమం కోస తప్ప అధికారం ముఖ్యం కాదని అభిప్రాయపడిన సోనియా గాంధీని మోదీ, అమిత్‌షా ఈడీ కేసులతో వేధిస్తుంటే పోరాటం చేయాల్సింది పోయి అమిత్‌షాతో కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకున్నారని రాజ్‌గోపాల్‌పై రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ములేకే ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అన్యాయంగా నోటీసులు ఇచ్చారన్నారు.