మునుగోడు నియోజకవర్గంలోనూ దళితబంధు అమలు చేయాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రావు నిరసన కార్యక్రమం చేపట్టారు. 2 వేల మందితో ఆందోళన చేపట్టేందుకు కోమటిరెడ్డి ప్రయత్నించారు. మునుగోడులో మంత్రి జగదీశ్‌రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంది. అయితే.. నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా.. రాజగోపాల్‌రెడ్డి దళిత బంధు కోసం నిరసన కార్యక్రమానికి మునుగోడు వెళ్లే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డితోపాటు కార్యకర్తలను బొంగులూరు గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.



అరెస్టులపై కోమటిరెడ్డి మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను ఓడించడానికే దళిత బంధు తీసుకొచ్చారని ఆరోపించారు. పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాలన్నారు.



మెున్న చౌటుప్పల్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంతో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటి రెడ్డి మధ్య వివాదం మెుదలైంది. ఈ కార్యక్రమంలో మెుదట ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం గురించి.. తనకు ముందుగా సమాచారం ఇవ్వలేదని.. ఇలా చెప్పకుండా కార్యక్రమాలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని.. ప్రశ్నించారు. నల్గొండలో జరిగిన కార్యక్రమంలో ఫ్లెక్సీపై ఎమ్మెల్యే ఫొటో పెట్టారని, ఇక్కడెందుకు లేదని అడిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టే.. తనపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
 
అనంతరం.. మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక ఏడేళ్లలో ఆకలి, దారిద్య్రం, ఆత్మహత్యలను రూపుమాపామని చెప్పారు. 2014 జూన్‌కు ముందు రాష్ట్రంలో, జిల్లాలో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుచేసుకోవాలన్నారు. మంత్రి ప్రసంగం చేస్తుండగానే.. ఎమ్మెల్యే కోమటి రెడ్డి తన కుర్చీలోంచి లేచి రాజకీయ ప్రసంగం వద్దంటూ అభ్యంతరం తెలిపారు.



కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే.. జగదీశ్ రెడ్డి మంత్రి అయ్యే వారు కాదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కరు మాత్రమే తెలంగాణ తేలేదని.. పార్లమెంటులో ఎంపీగా పోరాటం చేశానని గుర్తు చేశారు. వెంకట్ రెడ్డి మంత్రి పదవి త్యాగం చేశారని అన్నారు. ఈ క్రమంలోనే మంత్రి జగదీశ్ రెడ్డి చేతిలోనుంచి మైకు లాక్కునే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
ప్రభుత్వం మంచి పనులు చేయడం ఇష్టం లేక కొందరు అడ్డుకుంటున్నారంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి సభలో వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం చిల్లర నాటకాలు వద్దన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి, ప్రతి ఊరికి వస్తానన్నారు.


అక్కడున్న జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, పురపాలిక ఛైర్మన్.. పలువుర ఎమ్మెల్యేను సముదాయించి పక్కకు తీసుకెళ్లారు. ఈ వివాదం నడుస్తుండగానే.. మంత్రికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలూ నినాదాలు చేశారు. మంత్రి ఆదేశించగా.. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు సమావేశ హాలు నుంచి బయటకు పంపించి వేశారు. అసలు ప్రొటోకాల్ పాటించడం లేదని ఆగ్రహంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.



ఈ ఘటనపై ఎమ్మెల్యే.., ఆయన అనుచరులపై చౌటుప్పల్‌ తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారని ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇవాళ.. దళిత బంధు మునుగోడు నియోజకవర్గంలో అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు.