Munugode By Election: తెలంగాణ బీజేపీపై ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు టీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా నియోజక వర్గంలో భారీగా మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారని తెలిపింది. అయితే బీజేపీపై ఫిర్యాదు చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి  రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఈరోజు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ని కలిసి మునుగోడులో జరుగుతున్న పరిస్థితులను గురించి వివరించే ప్రయత్నం చేశారు. 


మద్యం, నగదు పంపిణీతో పాటు వారి నిరసనలూ ఆపండి..


ముఖ్యంగా చౌటుప్పల్ పట్టణం, నారాయణపేటలోని జనగామ, చండూరు, మర్రిగూడలోని తమ్మలపల్లి వంటి గ్రామాల్లో భారీ ఎత్తున బీజేపీ మద్యం, నగదును పంపిణీ చేస్తుందని తెలిపారు. అక్రమంగా కాషాయ దళం నేతలు మద్యం, డబ్బులు పంపిణీ చేయడాన్ని వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం రాత్రి నుంచి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు, నిరసనలు చేయడంతోపాటు ఈరోజు భారీగా నగదు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. అడగడానికి వెళ్లిన క్షేత్రస్థాయి అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో ఎలక్షన్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి వికాస్ రాజ్ ని కోరారు. 


నిన్న రాత్రి రాజగోపాల్ రెడ్డి ధర్నా..


అర్థరాత్రి మునుగోడు నియోజకవర్గం చండూరులో హైడ్రామా నడిచింది. నియోజకవర్గం వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు మకాం వేసి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి ధర్నా చేశారు. చండూర్ ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన చేపట్టారు. తన అనుచరులతో వచ్చి ఆర్వోతో మాట్లాడారు. అనంతరం ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చున్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల కోసం తాను రాజీనామా చేశానని... ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. రూల్స్‌కు విరుద్ధంగా తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే మకాం వేశారని ఆరోపించారు. అధికారులు పట్టించుకోవట్లేదంటూ ధర్నాకు దిగారు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకలు ఇళ్లల్లోనే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని తెలిపారు. 


నెలరోజులుగా మాపై దాడులు జరుగుతూనే ఉన్నాయి..


స్థానికేతరులు ఉన్నారని ఆర్వోకి ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలీసులు పూర్తిగా బిజెపి నాయకులపై వివక్ష చూపిస్తున్నారన్నారు. కేంద్ర బలగాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా గ్రామలలో ఎటువంటి భద్రత రక్షణ పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుండి తనపై తన కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి. మంగళవారం ప్రచారం ముగిసిన నుంచి బయట వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నేతలు మునుగోడు నియోజకవర్గంలో ఉంటున్నారని ఆక్షేపించారు. తనపై దాడి కారణంగా నియోజకవర్గంలో ఉండే పరిస్థితి లేదన్నారు. తాను రాజీనామా చేసింది మునుగోడు ప్రజల కోసమని... ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని అనుకుంటున్నామన్నారు. బయట వ్యక్తులు మునుగోడు నియోజకవర్గం నుంచి వెళ్లిపోయేవరకు ధర్నా చేస్తామన్నారు.