Most trending news in telangana 2022 :  తెలంగాణ అంటే ఓ మినీ ఇండియా.  హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల వాళ్లూ నివహిస్తూ ఉంటారు. అదే సమయంలో రాజకీయంగా కూడా హైపర్ యాక్టివ్ నేతలు ఉన్నారు. అందుకే తెలంగాణలో ఎప్పుడూ ఏదో ఓ సంచలనం కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఏడాది అంటే 2022లో జరిగిన మోస్ట్ ట్రెండింగ్ న్యూస్ ఏమిటో ఓ సారి చూద్దాం..  
 
టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మార్పు 


ఈ ఏడాది తెలంగాణలో ఎక్కువగా మాట్లాడుకున్న అంశం .. తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్‌గా మార్చడం. దసరా రోజున తీర్మానం చేస్తే..ఎన్నికల సంఘం ప్రక్రియ డిసెంబర్ 8వ తేదీకి పూర్తయింది. టీఆర్ఎస్ పేరును మారుస్తూ ద‌స‌రా రోజున‌ నిర్వ‌హించిన పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో తీర్మానం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణం అయిన టీఆర్ఎస్ ఇక  చరిత్రలో కలిసిపోయింది. ఇక నుంచి బీఆర్ఎస్ గా దేశ ప్రజల ముందు ఉంటుంది. 


సమతా మూర్తి విగ్రహావిష్కరణ 


పంచలోహాలతో రూపొందించి కూర్చున్న మూర్తుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద రెండో విగ్రహంగా పేరు గాంచిన 216 ఫీట్ల స‌మాతా మూర్తి విగ్ర‌హాన్ని ప్ర‌ధాని మోడీ ఆవిష్కరించారు. ముచ్చింతల్‌ దివ్యక్షేత్రంలో రూ. 1200కోట్ల వ్యయంతో సమతామూర్తి కేంద్రాన్ని 45ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేశారు. పద్మపీఠంపై ఉన్న రామాజాచార్యుల విగ్రహం ఎత్తు 108 అడుగులు. వేదికపైకి వెళ్లేందుకు 108 ఉజ్జీవ సోపానాలు ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో స్వామి స్వర్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇదో పర్యాటక ప్రాంతంగా మారింది. కొన్ని 


తెలంగాణ ఇండిపెండెన్స్, ఆవిర్భావ వేడుకలు !


కేంద్రం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను  ” అజాదీ కా అమృత్ మహోత్సవ్” పేరుతో  నిర్వహించింది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం  కేంద్రంతో సంబంధం లేకుండా.. కొత్తగా “స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ ” పేరుతో వేడుకలు నిర్వహించారు.  ద్విసప్తాహం నిర్వహణకు ప్రత్యేక చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. కేంద్రం ముద్ర లేకుండా నిర్వహించడం ట్రెండింగ్ అయింది. ఆ తర్వాత తెలంగాణ  విమోచనా దినాన్ని కూడా కేంద్రం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడంతో.. తెలంగాణ ప్రభుత్వం వాటిని మరిపించేలా వైభవంగా జరిపింది. ఈ వ్యవహారాలు ట్రెండింగ్‌గా మారాయి. 


వరదలతో కాళేశ్వరం మునక 


గత  జూలైలో వచ్చిన ఙారీ వరదలతో కాళేశ్వరం నీట మునిగింది.  నీటిని లిఫ్ట్ చేసే కన్నెపల్లి, దానికి పైనున్న అన్నారం పంపుహౌస్‌‌లు పూర్తిగా మునిగిపోయాయి. రెండు పంపుహౌసుల్లో కలిపి 29 బాహుబలి మోటార్లు, వాటిని ఆపరేట్‌‌ చేయాల్సిన ఎలక్ట్రో మెకానికల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌, కంట్రోల్‌‌ ప్యానళ్లు, కంప్యూటర్లు, రెండు భారీ ఎయిర్‌‌ కండిషన్‌‌ సిస్టమ్​లు, రెండు స్కాడా సిస్టమ్​లు, సబ్‌‌ స్టేషన్లు ఇట్లా అన్నీ వరదలో కనిపించకుండాపోయాయి. దీంతో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ వివరాలను రహస్యంగా ఉంచాలనుకోవడం..  విదేశాలు క్లౌడ్ బరస్ట్ కుట్ర చేశాయని కేసీఆర్ ఆరోపించడం సంచలనాత్మకం అయింది. 


తెలంగాణలో రాహుల్ రెండు వారాల పాదయాత్ర


భారత్ జోడో యాత్ర తెలంగాణలో రెండు వారాల పాటు సాగింది. రాహుల్ యాత్ర తెలంగాణలో విజయవంతంగానే సాగింది..ఆయన యాత్ర జరిగిన ప్రాంతాల్లో జనం నుంచి అనూహ్య స్పందన వచ్చింది.  యాత్రలో రాహుల్ ఆద్యంతం ప్రజలని దగ్గర చేసుకుంటూ ముందుకెళ్లారు.  అందరినీ హక్కున చేర్చుకున్నారు..అలాగే తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా నడిచారు..డ్యాన్స్ వేశారు..పిల్లలతో ఆడుకున్నారు..ఏ వర్గం వాళ్ళతో ఆ విధంగా కలిసిపోయారు. ఇలా రాహుల్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. ఇక తాజాగా పాదయాత్ర తెలంగాణలో ముగిసి..మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. ఇక తెలంగాణలో పాదయాత్ర ముగింపు సందర్భంగా జుక్కల్‌లో భారీ సభ జరిగింది. ఈ సభ కూడా భారీ స్థాయిలోనే జరిగింది..ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 
 కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవ  అరెస్ట్  


ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒకే సారి నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు కారణం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ అని ఆ నలుగురు వీడియోను సూసైడ్ నోట్‌గా రికార్డు చేయడం సంచలనం సృష్టించింది. సమస్యను పరిష్కరించాలంటే తన భార్యను పంపమన్నారన్న ఆవేదనతో వారు ఆత్మహత్య చేసుకున్నారు. వనమా రాఘవను తర్వాత అరెస్ట్ చేశారు. వనమా రాఘవ వ్యవహారాలు ఒక్క సారి ట్రెండింగ్‌లోకి వచ్చాయి.  ఆది నుంచి అనేక హత్య ఆరోపణలతోపాటు బెదిరింపులు, భూ కబ్జాల పాల్పడినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 
 
వెలుగులోకి ఫామ్ హౌస్ కేసు!


ఓ వైపు మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతూండగా హైదరాబాద్‌ శివారులోని మొయినా బాద్‌లో  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  ఫామ్ హౌస్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరం ఆడుతూ పోలీసులకు దొరికారు ముగ్గురు వ్యక్తులు. అక్కడ్నుంచి ఆ కేసు ట్రెండింగ్‌లోనే ఉంది. రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చెప్పడం కష్టం. సిట్ దర్యాప్తు అటూ ఇటూ కదులుతోంది. నలుగురు ఎమ్మెల్యేలు చాలా కాలం ప్రగతి భవన్ లోనే ఉండి బయటకు వచ్చారు. 
 
మునుగోడు ఉపఎన్నిక 


కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది. మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ రాజకీయ పార్టీలన్నీ సెమీ ఫైనల్స్‌గా భావించాయి. ఇక్కడ గెలిచే పార్టీకి ఫైనల్స్‌లో అడ్వాంటేజ్ ఉంటుందని నమ్మకంగా చెబుతూ వచ్చాయి. అందుకే శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. చివరికి టీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడు ఉపఎన్నిక ఈ ఏడాదిలో  ట్రెండింగ్‌లో నిలిచిన వార్తల్లో ఒకటి 


లిక్కర్ కేసులో కవిత పేరు కలకలం 
 
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి సారి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. తర్వాత సీబీఐ కూడా నోటీసులు జారీ చేసింది. విచారణ ఈ నెలలో జరగాల్సి ఉంది. 


ఇవీ తెలంగాణలో ఈ ఏడాది మోస్ట్ ట్రెండింగ్ న్యూస్