Mens Suicide In Hyderabad: మగాడు.. మనసులో ఎన్ని సమస్యలు, కష్టాలు ఉన్నా.. అన్నింటిని మౌనంగా భరిస్తూ పైకి నవ్వుతూ కపిస్తూ ఉంటాడు. బాధ్యతలు, బరువులు మోస్తూ సమాజంలో కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. మేరుమగధీరడుగా పిలిపించుకుంటూ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొంటూ పైకి గంభీరంగా కనిపిస్తాడు. కానీ అలా కనిపించడానికి లోలోన నలిగిపోతుంటాడు. వాటిని భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (National Crime Records Bureau)– 2022 గణాంకాలు పురుషుల ఆత్మహత్యల (Mens Suicides) గురించి సంచలన విషయాన్ని బయటపెట్టాయి. 


జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, కొన్ని సార్లు కష్టాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో పురుషులు ఎక్కువగా ఉన్నారని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. ముఖ్యంగా సిటీలో  నమోదైన ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులవే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి. బాధ్యతలు, బరువులు, ఒత్తిడి, విరక్తి ఎక్కువగా ఉండడం, కొన్ని సార్లు మనోనిబ్బరం బలహీనంగా ఉండడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. 


హైదరాబాద్‌ (Hyderabad)లో 2022లో మొత్తం 544 ఆత్మహత్య జరిగాయి. ఇందులో పురుషులు ఏకంగా 433 మంది ఉన్నారు. 111 మంది మహిళలు ఉన్నట్లు మంగళవారం విడుదలైన ఎన్‌సీఆర్‌బీ (NCRB) గణాంకాల్లో తేలింది. మొత్తం ఆత్మహత్యల్లో పురుషులు దాదాపు 80 శాతం ఉన్నట్లు వెల్లడైంది. అంతే కాదు ఆత్మహత్యల సంఖ్యలో దేశంలో హైదరాబాద్‌ పదో స్థానంలో ఉంది.  కష్ట, నష్టాలను సులువుగా ఎదుర్కొనే పరుషులు కొన్ని సార్లు నిరాశ, నిస్పృహలతో క్షణిక కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు.


దేశ వ్యాప్తంగా ఎంత మంది అంటే
దేశ వ్యాప్తంగా గత ఏడాది 1,70,924 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి కేవలం రికార్డులకెక్కినవి మాత్రమే. రికార్డుల్లో చేరనివి ఇంతకు మించే ఉంటాయని అంచనా. అధికారికి గణాంకాల ప్రకారం 9,980 బలన్మరణాలు రాష్ట్రంలో జరిగాయి. మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీ 3367 ఆత్మహత్యలతో ప్రథమ స్థానంలో ఉంది. బెంగళూరు (2313) ద్వితీయ స్థానంలో ఉండగా, సూరత్‌ (1004) మూడో స్థానంలో ఉంది. 


మహిళల కంటే నాలుగు రెట్లు అధికం
హైదరాబాద్ విషయానికి వస్తే 544 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో పురుషులు 433, మహిళలు 111 మంది ఉన్నారు. మహిళల కంటే పురుషులు 4 రెట్ల సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు కారణాలుగా నిలుస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలు జరుగుతున్నాయని, ఇందులో కుటుంబ కలహాలతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి.


ఇవే కారణాలు..
గత ఏడాది సిటీలో జరిగిన ఆత్మహత్యల్లో 20.5 శాతం అప్పులు, బ్యాంకు రుణాలు తీర్చలేకపోవడం వంటి కారణాల వల్లే జరిగాయి. వివాహేతర సంబంధాల కారణంగా  ముగ్గురు పురుషులు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో 120 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 87 మంది పురుషులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో 138 మంది సూసైడ్‌ చేసుకోగా వీరిలో మగవారు 100 మంది ఉన్నారు. 


సన్నిహితులు చనిపోయారనే కారణంతో ఏడుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమ వ్యవహారాల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారిలో మహిళల కంటే పురుషులు ఎక్కువ ఉన్నారు. ప్రేమ కోసం గత ఏడాది ఏడుగురు బలన్మరణం చెందారు. నిరుద్యోగం సైతం మగాళ్ల చావుకు కారణమవుతోంది. 13 మంది పురుషులు ఉద్యోగాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు.


పోలీసులు ఏమన్నారంటే..
ఆత్మహత్యల గురించి పోలీసులు స్పందిస్తూ.. రాష్ట్ర పోలీసులు ఇచ్చే జాబితా ఆధారంగా ఎన్‌సీఆర్‌బీ నివేదిక రూపొందిస్తుందన్నారు. చాలా ఆత్మహత్యలకు అసలు కారణాలు వెలుగులోకి రావని, కొన్ని ఉదంతాలు అసలు పోలీసు రికార్డుల్లోకే ఎక్కవని వెల్లడించారు. కుటుంబ వ్యవహారాలు, విఫల ప్రేమలు, వివాహేతర సంబంధాలతో జరిగిన బలన్మరణాలు బయటకు రాకుండా కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తారని తెలిపారు.