Ujjaini Mahankali Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని రెండ్రోజుల్లోనే 30 లక్షల మంది దర్శించుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆలయ ఈఓ, చైర్మన్, కమిటీ సభ్యులు చాలా బాగా పనిచేశారని ప్రశంసించారు. అలాగే పోలీసులు కూడా వారం రోజుల పాటు చాలా కష్ట పడ్డారని.. బోనాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు మొత్తం 270 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాధారణంగా అయితే కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయని.. కానీ ఏ చిన్నపాటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. పురోహితులు, ఆలయ సిబ్బంది, జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల వారు బాగా పని చేశారని కొనియాడారు. జలమండలి అదికారులు, సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, ఆర్ అండ్ బీ అదికారులు కూడా చాలా కష్టపడ్డారని మంత్రి తలసాని వివరించారు. ట్రాఫిక్ పోలీసుల కృషి కూడా చాలా బాగుందని పేర్కొన్నారు. ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది, డీఎంహెచ్ఓ అదికారులు బాగా పని చేశారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 


అలాగే మీడియా ప్రతినిధులు కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మంచి ప్రచారం కల్పించిందన్నారు. ప్రముఖులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దర్శనం చేసుకునే విదంగా ఏర్పాట్లు జరిగాయని.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతున్నాయనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రైవేట్ దేవాలయాలకు ఇచ్చే ఆర్థిక సాయం కూడా వారం ముందే ఇవ్వడం జరిగిందని.. ఇప్పటికీ జరుగుతుందన్నారు. కేసీఆర్ ధర్మరాజు లాగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని చెప్పుకొచ్చారు. మనకు ఉన్నన్ని పండుగలు దేశంలో ఎక్కడా లేవని హర్షం వ్యక్తం చేశారు. దేవాలయంలో కొన్ని కుటుంబాలకు వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాలను కొనసాగిస్తున్నామన్నారు. జాతర విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయానికి చుట్టూ పరిసర ప్రాంతాల్లోని రోడ్లన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని గుర్తు చేశారు. 






అంతకుముందే ఆషాడ బోనాల సందర్బంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 211 దేవాలయాలకు మంజూరైన 56.13 లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి తలసాని దేవాలయాల కమిటీ సభ్యులకు అందజేశారు. మారేడ్ పల్లి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఆషాడ బోనాల సందర్బంగా గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని 90 దేవాలయాలకు మంజూరైన 33.47 లక్షల రూపాయల విలువైన చెక్కులను కూడా అందజేశారు. మలక్ పేట్ నియోజకవర్గ పరిధిలోని 88 దేవాలయాలకు మంజూరైన 26.49 లక్షల రూపాయల విలువైన చెక్కులను కూడా ఈరోజే పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.