IT Tower in Siddipet: తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ రంగాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేశారు. సిద్దిపేట శివారులోని నాగులబండ వద్ద రాజీవ్‌ రహదారిని ఆనుకొని నిర్మించిన ఐటీ టవ‌ర్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు, ఐటీ మంత్రి కేటీఆర్‌ క‌లిసి గురువారం (జూన్ 15) ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ (KTR) ప్రసంగించారు. క‌లలో కూడా సిద్దిపేట‌కు ఐటీ హ‌బ్ వ‌స్తుంద‌ని ఎవరైనా అనుకున్నామా? అని అన్నారు. తెలంగాణ రాకపోయి ఉంటే సిద్దిపేట జిల్లా అయ్యేదా? ఐటీ సంస్థలు ఇక్కడికి వచ్చేవా అని అన్నారు. త్వరలోనే సిద్దిపేటలో టీ హబ్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ (KTR) చెప్పారు.


ఈ ఐటీ ట‌వ‌ర్ ప్రారంభం వల్ల సిద్దిపేట‌లో 1500 మందికి ఉద్యోగాలు ఏర్పడ్డాయని అన్నారు. ‘‘సిద్దిపేట‌కు పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాం. ఐటీ ట‌వ‌ర్ ప్రారంభం రోజునే సంస్థలు వ‌చ్చి ఉద్యోగాలు ఇవ్వ‌డం చాలా గొప్ప. ఐటీ హ‌బ్‌కు మ‌రిన్ని నిధులు మంజూరు చేసి విస్త‌రిస్తాం. సిద్దిపేట‌లో టీ హ‌బ్ కూడా ఏర్పాటు చేస్తాం. 2014లో రాష్ట్రంలో ఐటీ ఎగుమ‌తులు కేవ‌లం రూ.56 వేల కోట్లు మాత్ర‌మే అని, ఇవాళ రూ. 2.41 ల‌క్ష‌ల కోట్లకు ఐటీ ఎగుమ‌తుల‌కు చేరుకున్నామ‌ని కేటీఆర్ మరోసారి చెప్పారు.


సిద్దిపేటలో ఐటీ హబ్ ను 3 ఎకరాల స్థలంలో రూ.63 కోట్లతో కట్టారు. జీ ప్లస్‌ 4 అంతస్థుల్లో ఐటీ టవర్‌ ఉంది. ఈ టవర్‌ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్‌ 2020 డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేశారు. అదే రోజు వివిధ కంపెనీలతో ఒప్పందాలపై ఐటీ శాఖ కార్యదర్శి సంతకాలు చేశారు. మంగళవారం సిద్దిపేటలో మెగా జాబ్‌మేళా నిర్వహించగా, పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. ఓఎస్‌ఐ డిజిటల్‌ , ఫిక్సిటీ టెక్నాలజీస్‌, అమిడాయ్‌ ఎడ్యుటెక్‌, జోలాన్‌ టెక్‌, విజన్‌ ఇన్ఫో టెక్‌, థోరాన్‌ టెక్నాలజీస్‌, బీసీడీసీ క్లౌడ్‌ సెంటర్స్‌, ర్యాంక్‌ ఐటీ సర్వీసెస్‌, కామ్‌సీఎక్స్‌ ఐటీ, ఎంఎస్‌పీఆర్‌, అమృత సిస్టమ్‌, ఇన్నోసోల్‌  ఉద్యోగాలు ఇచ్చాయి.


తొలుత 718 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేసుకున్నాయి. జాబ్‌ మేళాలో ఉద్యోగాలు పొందినవారికి టాస్‌ ద్వారా శిక్షణ అందిస్తారు. సిద్దిపేట ఐటీ టవర్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన కంపెనీలకు రెండేళ్ల పాటు ఉచితంగా నిర్వహణ, అద్దె, విద్యుత్తు, ఇంటర్నెట్‌ బిల్లులు భారం లేకుండా చూస్తామని మంత్రి హరీశ్‌ రావు (Harish Rao) హామీ ఇచ్చారు.


తెలంగాణ మోడ‌ల్ అంటే స‌మ‌గ్ర‌, స‌మ్మిళిత‌, స‌మీకృత‌, స‌మ‌తుల్య అభివృద్ధి అని కేటీఆర్ అన్నారు. 3 శాతం గ్రామీణ జ‌నాభా ఉన్న తెలంగాణ దేశంలో 30 శాతం అవార్డులు సాధిస్తున్నాయని అన్నారు. హ‌రిత‌హారం ద్వారా రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నాన్ని 7.7 శాతానికి పెంచామని అన్నారు. మిష‌న్ భ‌గీర‌థ‌కు పునాది ప‌డిన గ‌డ్డ సిద్దిపేట అని కేటీఆర్ అభివర్ణించారు.