Minister Konda Surekha Comment on BRS Mlc Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) లిక్కర్ స్కాంలో ఇరుక్కుని లిక్కర్ రాణిగా మారారంటూ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ (Hanmakonda) జిల్లాలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీపై కవిత చేసిన వ్యాఖ్యలపై ఆమె గట్టి కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు కవిత బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంది నిజం కాదా.? అని ప్రశ్నించారు. 'అమెరికాలో అంట్లు తోముకునే కవిత వందల కోట్లు విలువైన సొంత విమానాలు కొనుక్కునే స్థాయికి ఎలా ఎదిగారు.?. వార్తల్లో నిలవడానికే కొత్తగా పూలే విగ్రహం అంశాన్ని ఎత్తుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందా.?. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీని చేస్తే పూలేపై ప్రేమ ఉన్నట్లే.' అని సురేఖ వ్యాఖ్యానించారు. 


కవితకు సవాల్


ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. భద్రాద్రి శ్రీరాముల కల్యాణానికి కేటీఆర్ కొడుకు హిమాన్షు ఏ హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించాడో కవిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ నిజామాబాద్ లో పోటీ చేసి గెలవాలని కవితకు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు కబ్జాలు, రౌడీయిజానికే పరిమితం అయ్యారని మండిపడ్డారు. నిధులను సరిగ్గా వినియోగించుకోలేక పోయారని అన్నారు. వరంగల్ రాష్ట్రంలో రెండో అతి పెద్ద సిటీగా మారుస్తామని.. వర్ధన్నపేటలో నూతన గ్రౌండ్ నిర్మిస్తామని మంత్రి చెప్పారు. వరంగల్ బస్టాండ్ అభివృద్ధి చేస్తామని.. రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు.


కవితపై బండ్ల గణేష్ ఫైర్






మరోవైపు, ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని ఇప్పుడు గుర్తొచ్చిందా.? అంటూ ప్రశ్నించారు. ఎప్పుడైనా బీసీల గురించి మీరు మాట్లాడారా.? అని నిలదీశారు. 'తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించొద్దు. మీ హయాంలో గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్ ను చంపేశారు. ఆయన పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది. లిక్కర్ స్కాంతో రాష్ట్రాన్ని అపఖ్యాతి పాలు చేసింది మీరు కాదా.? సీఎం కావాలని మీరు కేటీఆర్ ఆశపడ్డారు. అది సాధ్యం కాలేదని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ముందు లిక్కర్ స్కాం నుంచి బయటపడండి. రెస్ట్ తీసుకోండి. ఏం తప్పు చేశారో తెలుసుకోండి. ప్రెస్ మీట్స్ బంద్ చేయండి.' అంటూ హితవు పలికారు.


Also Read: Telangana Cabinet Meet : ఆదివారం తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్ !,