గ్రామ పంచాయతీ నిధులను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర నిధులు వచ్చి రాగానే నిధులను మళ్లిస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్ లు నిరసన చేస్తున్న వేళ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని విమర్శిస్తున్నారని, అదంతా అబద్ధమని కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 


గ్రామ పంచాయతీ నిధులను తెలంగాణ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని అన్నారు. కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయిల్ ​పామ్‌ సాగును కేంద్రం ప్రోత్సహిస్తోందని అన్నారు. తెలంగాణకు కేంద్రం రూ.5 వేల కోట్లు ఇచ్చిందని.. ఈ నిధులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే దారిమళ్లించిందని చెప్పారు. పంచాయతీల ఖాతాల్లోకి నిధులు వేసిన గంటలోనే మళ్లించారని ఆరోపించారు. ఉపాధి హామీ నిధులను కూడా దారి మళ్లిస్తున్నారని చెప్పారు. పంచాయతీ నిధుల కోసం సర్పంచ్‌లు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పోలీసుల నిర్బంధం ద్వారా సర్పంచ్‌లు నిధుల కోసం ప్రశ్నించకుండా ప్రభుత్వం వారి గొంతు నొక్కుతోందని కిషన్ రెడ్డి ఆక్షేపించారు.


తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై అదనంగా 13 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ప్రధాన కారణం అని అన్నారు. కేంద్రం కోరిక మేరకు 13 రాష్ట్రాలు పెట్రోలియం ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం స్పందించలేదని చెప్పారు. కనీసం ఒక్క రూపాయి కూడా తగ్గించే ప్రయత్నం చేయలేదని అన్నారు. ధరలు పెరిగితే పన్నుల ద్వారా ఆదాయం పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్ధికంగా దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.