ఆంధ్రప్రదేశ్‌లో పాలనా పరిస్థితుల గురించి తెలంగాణ మంత్రి హరీశ్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ (భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా) ఉన్నదని మాట్లాడారు. మేడే రోజున కార్మికులు కేసీఆర్ నోటి నుంచి మరిన్ని శుభవార్తలు వింటారని హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసని హరీశ్‌రావు అన్నారు. అందుకే ఏపీలో ఓటు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని వారికి సూచించారు.


తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామి అయ్యే ప్రతి కార్మికుడు రాష్ట్రంలో అంతర్భాగమే అని హరీశ్ రావు అన్నారు. ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్లు వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారని, ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది వచ్చారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఏపీ నుంచి వచ్చిన వారు అప్పుడప్పుడూ సొంతూరికి వెళ్లినప్పుడు అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏలా ఉంటుందో మీకు తెలియదా? అని అడిగారు. ‘‘అంత తేడా ఉన్నప్పుడు మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ బంద్‌ చేసుకొని ఇక్కడ నమోదు చేసుకోండి. మీరు కూడా మావాళ్లే’’ అని హరీశ్ రావు మాట్లాడారు. ఒక చోటే ఓటు పెట్టుకోండి.. గదీ తెలంగాణలోనే పెట్టుకోండి అని హరీశ్ రావు కోరారు. 


రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఒక ఎకరం విస్తీర్ణంలో రూ.2 కోట్ల ఖర్చుతో కార్మిక భవనాలను నిర్మిస్తామని చెప్పారు. మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు పొందడానికి వీలుగా భవన నిర్మాణ కార్మిక మండలిలో మెంబర్ షిప్ తీసుకోవాలని ఆయన సూచించారు.


తెలంగాణలో వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలను నిలిపివేసిందని హరీశ్ రావు అన్నారు. అదే ఏపీలో మోటార్ల దగ్గర మీటర్లు పెట్టి ఆ ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు తెచ్చుకుందని ఆరోపించారు. ఏపీకి, తెలంగాణకు ఉన్న తేడా ఇదేనని చెప్పారు.


సంగారెడ్డి పట్టణంలో హరీశ్ రావు పర్యటన


సంగారెడ్డి పట్టణంలోని నాల్​సాబ్ గడ్డలో బస్తీ దవాఖానను కూడా మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ‘‘బస్తి దవాఖాన మీకు సుస్తీ కాకుండా చూస్తుంది. సంగారెడ్డిలో మెడికల్ కాలేజి ఏర్పాటుతో వైద్య సదుపాయాలు మెరుగయ్యాయి. మైనార్టీల చదువుల సీఎం కేసీఆర్ గారు మైనారిటీ గురుకులాలు పెట్టారు. షాది ముబారక్ పథకం ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? కాంగ్రెస్ వాళ్లు ఎక్కువ మాట్లాడుతారు.. తక్కువ పని చేస్తారు. మైనార్టీల కోసం త్వరలోనే సంగారెడ్డిలోనే హజ్ హౌజ్ నిర్మిస్తాం’’ అని హరీశ్ రావు అన్నారు.


200 కొత్త అంబులెన్స్‌లు
తెలంగాణ వ్యాప్తంగా నెలన్నరలో కొత్తగా 200 అంబులెన్స్‌లను అందుబాటులోకి తెస్తామని మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. 3 లక్షల కిలో మీటర్లకు పైగా తిరిగిన అంబులెన్స్‌ల స్థానంలో వీటిని ప్రవేశపెడతామని అన్నారు. కొనుగోలు ప్రక్రియ మొదలైందని, సంగారెడ్డి జడ్పీ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రైవేటుగా ప్రాక్టీస్‌ చేయకుండా చట్టంలో మార్పు తెచ్చామని అన్నారు.