మెదక్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కారులో వ్యక్తి డెడ్ బాడీని ఉంచి ఆ కారుకు నిప్పు పెట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామ శివారులో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఆ ప్రాంతం అటవీ ప్రాంతం కావడంతో దుండగులు అక్కడ కారును వదిలేసి అందులో వారు శవాన్ని ఉంచి కాల్చేసి వెళ్లారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలిపోయిన కారు సమీప గ్రామస్థుల కంట పడడంతో వారు పరిశీలించగా.. డిక్కీలో కాలిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది.


దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తుప్రాన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చుట్టుపక్కల పరిశీలించారు. కారు మొత్తం కాలిపోవడంతో నెంబరు కూడా కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు కారు ఇంజిన్ నెంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్ నెంబరును కనిపెట్టారు. దీంతో ఆ కారు మెదక్‌లోని ఓ సినిమా థియేటర్ యజమానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. డీఎస్పీ కిరణ్‌ కుమార్‌, సీఐ స్వామిగౌడ్‌, నర్సాపూర్‌ సీఐ లింగేశ్వర్‌రావు, నారాయణపేట సీఐ నాగార్జున గౌడ్‌ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.




Also Read: School Reopen: తెలంగాణలో స్కూళ్ల రీఓపెన్ ఎప్పుడు? విద్యాశాఖ ఏం చెప్పిందంటే.. మరి సర్కార్ ఒప్పుకుంటుందా?


మంటల్లో కాలిపోయిన కారు నెంబరు టీఎస్ 05 ఈహెచ్ 4005 అనే నెంబర్‌ గల ప్లేట్‌ అని పోలీసులు గుర్తించారు. ఆ కారు పేరు హోండా సివిక్. ఈ కారు కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్‌ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ ఆదివారం స్వగ్రామం నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. అయితే, శ్రీనివాస్‌ ఫోన్ గత రాత్రి నుంచి స్విచ్ఛాఫ్ నుంచి వస్తుందని ఆయన భార్య వెల్లడించింది. కారులోని మృతదేహం ఎవరిదనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. పోలీసులు విచారణ చేస్తున్నారు.


అయితే, కారు డిక్కీలో శవాన్ని ఉంచి ఆ కారును కాల్చేయడంతో అతి హత్య అనే అనుమానం బలంగా ఉంది. చనిపోయిన వ్యక్తిగా భావిస్తున్న శ్రీనివాస్ కూడా కనిపించకపోవడంతో ఆయనే అయి ఉంటుందని అనుకుంటున్నారు. ఆయన ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించడంతో పాటు, ఆ మార్గంలోని సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు క్షుణ్నంగా జల్లెడ పడుతున్నారు.


Also Read: RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు కరోనా.. గాంధీ ఆస్పత్రిలో చేరిన మాజీ ఐపీఎస్


Also Read: Telangana ACB: లంచాల కలెక్షన్ కోసం వాట్సాప్‌ గ్రూప్‌.. ఏవో తెలివితేటలకు బిత్తరపోయిన ఏసీబీ అధికారులు