Katakam Sudarshan: మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మృతి చెందారు. మే 31వ తేదీన మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన విడుదల చేశారు. కటకం సుదర్శన్ బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. నాలుగున్నర దశాబ్దాల క్రితం ఆయన ఉద్యమంలోకి వెళ్లారు. ఈ మేరకు సంతాప సభలు నిర్వహించాలని మావోయిస్టులకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

జూన్ 5 నుంచి ఆగస్ట్ 3 వరకు సంతాప సభలు

కటకం సుదర్శన్ చాలా కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో పాటు డయాబెటిస్, బీపీ సమస్యలతో సతమతం అవుతున్నారని తెలుస్తోంది. గత బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు గుండెపోటుకు గురై ఆయన మరణించినట్లు ప్రకటించారు. ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం, కార్యకర్తలు, దళ కమాండర్లతో పాటు వందలాది మంది సుదర్శన్ స్మారక సభ నిర్వహించినట్లు సమాచారం. అనంతరం విప్లవ సంప్రదాయాలతో కటకం సుదర్శన్ అంత్యక్రియలు నిర్వహించినట్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ వెల్లడించారు. జూన్ 5 నుంచి ఆగస్ట్ 3 వరకు దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సుదర్శన్ సంతాప సభలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.

59 ఏళ్లు పాటు అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు కార్యకలాపాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓ కార్మిక కుటుంబంలో 69 ఏళ్ల క్రితం జన్మించారు కటకం సుదర్శన్.. యుక్త వయస్సులోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితులయ్యారు. శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో మైనింగ్ డిప్లోమా చదువుతున్నప్పుడే ఉద్యమం వైపు అడుగులు వేశారు. 1975లో రాడికల్ విద్యార్థి సంఘం నిర్మాణంలో కటకం సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బెల్లంపల్లి పార్టీ సభ్యుడిగా సుదర్శన్ పని చేశారు. అదే సమయంలో సింగరేణి కార్మిక ఉద్యమం, రాడికల్ విద్యార్థి ఉద్యమాల్లో కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ కీలక పాత్ర పోషించారు. 1978లో లక్షెట్టిపేట, జన్నారం ప్రాంతాల మావోయస్టు పార్టీ ఆర్గనైజర్ గా రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. 1980 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1987లో దండకారణ్య ఫారెస్ట్ కమిటీకి కటకం సుదర్శన్ ప్రాతినిధ్యం వహించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషన్ జోనల్ కార్యదర్శిగా పని చేశారు సుదర్శన్. 2001లో రెండోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 వరకు సెంట్రల్ రీజనల్ బ్యూరో సెక్రటరీగా పని చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా తన బాధ్యతల నుంచి కటకం సుదర్శన్ తప్పుకున్నారు. మావోయిస్టు భావాలానికి ప్రభావితం అయ్యాక దాదాపు 59 సంవత్సరాల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. ఉత్తర తెలంగాణ-ఛత్తీస్ గఢ్ మధ్య విస్తరించిన దండకారణ్యాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని కార్యకలాపాలను సాగించారు.

కటకం సుదర్శన్ తల్లిదండ్రులు మల్లయ్య, వెంకటమ్మ 2018లో మృతి చెందారు. ఆయన భార్య సాధన ఇది వరకే పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. సాధన కూడా మావోయిస్టు ఉద్యమం నుంచి వచ్చిన వారే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు కార్యదర్శిగా పని చేశారు. కటకం సుదర్శన్ తో పాటు సాధన కూడా సుదీర్ఘకాలం పాటు మావోయిస్టు ఉద్యమంలో పని చేశారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిశారు.