మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జిన్నా’ వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించి టైటిల్ ను రిలీజ్ చేశారు. తిరుమల కొండల వెనుక నుంచి జిన్నా అనే పేరు వస్తూ ఆ టైటిల్ ను మేకర్స్ డిజైన్ చేశారు. అయితే, ఈ పేరుతో పాటు తిరుమల కొండలపై జిన్నా అనే పేరు ఉంచడంపై వివాదం నెలకొంది. దీన్ని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు బీజేపీ నేత విష్ణు వర్థన్ రెడ్డి హెచ్చరిక చేస్తూ ట్వీట్ చేశారు.


మహ్మద్ అలీ జిన్నా గురించి మంచు విష్ణు తెలుసుకోవాలని విష్ణు వర్థన్ రెడ్డి హితవు పలికారు. అన్యమతానికి చెందిన జిన్నా దేశ విభజనకు కారణమయ్యాడని, ఎంతో మంది ఊచకోతకు, మానభంగాలకు కారణమయ్యాడని విష్ణువర్థన్ రెడ్డి గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి పేరును సినిమాకు పేరుగా పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాక, పవిత్రమైన తిరుమల కొండల పైన జిన్నా పేరును ఉంచడాన్ని విష్ణు వర్థన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆదివారం (జూన్ 12) ఆయన ఓ ట్వీట్ చేశారు.


‘‘భారత దేశంలో వేల మంది ఊచకోతకు కారణమైన వ్యక్తి జిన్నా పేరుపైన మంచు విష్ణు సినిమా పేరు పెట్టుకోవడం సిగ్గుచేటు. దేశంలో ఒకే ఒక్క చోట్ గుంటూరులో జిన్నా టవర్ అనే పేరుతో ఒక నిర్మాణం ఉండగా, దాన్ని తొలగించాలని మేం ఉద్యమం చేస్తుంటే.. సినిమాల్లో జిన్నా పేరును పెట్టుకున్నారు. ఏకంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండలపైన అన్యమతస్థుడైన జిన్నా పేరుతో టైటిల్ తయారు చేసి రిలీజ్ చేయడం సిగ్గుచేటు. ఇటీవలే మంచు విష్ణు అనేక ప్రముఖుల విషయాల గురించి, కందూకూరి వీరేశలింగం గురించి మాట్లాడారు. 


జిన్నా గురించి, మహ్మద్ జిన్నా జీవిత్ర చరిత్ర, అతని మానభంగాల గురించి మీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నాము. కాబట్టి, సినిమాల్లో ప్రచారం కోసం మరో రామ్ గోపాల్ వర్మ మాదిరిగా, దేశ విభజనకు కారకుడైన వ్యక్తి పేరును తక్షణం ఉపసంహరించుకోవాలి. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొండలపై ఉంచిన జిన్నా టైటిల్ ను తొలగించి హిందువుల మనోభావాలను గౌరవించాలి. తక్షణం దాన్ని ఉపసంహరించుకోవాలి’’ అని బీజేపీ తీవ్రంగా హెచ్చరిస్తోందని ఆ పార్టీ నేత విష్ణు వర్థన్ రెడ్డి వీడియోను విడుదల చేశారు.