Manchu Lakshmi :  టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విద్యను అందించేందుకు దత్తత తీసుకునేందుకు ఆ సంస్థ ఫౌండర్, సినీనటి లక్ష్మీ మంచు ముందుకు వచ్చారు.  గద్వాలలో  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో మంచు లక్ష్మి సమావేశమయ్యారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్య, కంప్యూటర్ క్లాస్ తదితర మౌళిక వసతులు కల్పించనున్నట్లు ప్రకటించారు.  జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడానికి బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు.  ఆయా పాఠశాలలకు డిజిటల్ బోధన కోసం ఇప్పటికే మెటీరియల్ సిద్ధం చేసినట్లు తెలిపారు. 


ఇప్పటికే యాదాద్రి జిల్లాలో స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి                         


యాదాద్రి భువనగిరి జిల్లాలో 56 పాఠశాలలను దత్తత తీసుకున్నారు.   టీచ్ ఫర్ ఛేంజ్‌లో భాగంగా  1-10 తరగతుల పిల్లలకు మూడేళ్ల పాటు మూడు స్థాయిల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ఆలేరు మండలం పటేల్‌గూడెం పాఠశాలలో  స్మార్ట్‌ క్లాస్‌ రూములను  ఏర్పాటు చేశారు.   విద్యార్థులకు చదువులో నైపుణ్యం కల్పించేందుకు ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’ సంస్థ సహకరిస్తోంది. టీచ్ ఫర్ ఛేంజ్   ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడం ఈ సంస్థ లక్ష్యం. ఇప్పటికే మంచి గుర్తింపును పొందిన ఈ సంస్థ.. ప్రతి సంవత్సరం నిధుల సమీకరణ కోసం కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది.                 


2014లో టీచ్ ఫర్ ఛేంజ్ ను స్థాపించిన మంచు లక్ష్మి                 


2014లో స్థాపించబడిన ఈ సంస్థ ప్రభుత్వ పాఠశాలలో విద్య నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా కొనసాగుతోంది. అంతేకాదు ఫ్లాగ్‌షిప్‌ వాలంటీర్‌ ప్రొగ్రామ్‌, స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌ల నిర్వహణ, ప్రభుత్వ పాఠశాలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు తదితర అంశాల కోసం అవిశ్రాంతంగా కృషిచేస్తోంది. ప్రస్తుతం 248 ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 42 ,080 మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి లబ్దిపొందుతున్నారని మంచు లక్ష్మి ప్రకటించారు.  నాణ్యమైన విద్యను పేద, మధ్యతరగతికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు అందించేందుకు మా సంస్థ ఎప్పుడూ కృషి చేస్తుందని ప్రకటించారు. 


 ఫ్యాషన్ షోలు ఏర్పాటు చేస్తూ నిధుల సమీకరణ                    


ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వివిధ కమ్యూనిటీలకు చెందిన చిన్నారుల్లో అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపర్చడానికి ఈ ఎన్జీవో పని చేస్తుంది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన వాలంటీర్లు ఎన్జీవో ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్యను బోధిస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లలో చురుగ్గా ఉన్న ఎన్జీవో..   ముంబై, ఢిల్లీ, లక్నో, చెన్నైలకు కూడా తన కార్యకలాపాలను విస్తరించింది.