MP Komatireddy : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని అధిష్టానాన్ని కోరతామన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకే కోమటిరెడ్డి ఇలాంటి ప్రతిపాదన చేస్తున్నట్లు ఆ పార్టీలోనే కొందరు నేతలు అనుకుంటున్నారు. తరచూ దిల్లీలో పర్యటిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి...ప్రధాని మోదీని కలుస్తున్నారు. దీంతో ఆయన కూడా బీజేపీలోకి జంప్ అవుతారన్న ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన కోమటిరెడ్డి..  తాను పార్టీ మారడంలేదని స్పష్టం చేశారు. మంచిర్యాలలో మీడియాతో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి...దళితులకు సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. దళిత బంధు పథకం బీఆర్ఎస్ నేతలకు దోపిడీగా మారిందన్నారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులకు అండగా ఉన్నట్టు కాదన్నారు. రాష్ట్రంలో 16 శాతం ఉన్న మాదిగలకు ఇప్పటి వరకూ మంత్రి వర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. దళిత నాయకుడు మల్లిఖార్జున ఖర్గేను తమ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని, కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు సముచిత స్థానం ఉంటుందన్నారు. 


రేవంత్ కు చెక్ పెట్టేందుకేనా? 


ఏలేటి మహేశ్వర్‌రెడ్డి  కాంగ్రెస్ పార్టీని వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని కోమటిరెడ్డి అన్నారు. తాను కూడా పార్టీ వీడుతున్నట్టు ప్రచారం చేశారని, తానంటే గిట్టనివాళ్లు దుష్ప్రచారం చేస్తుంటారని మండిపడ్డారు. తాను 33 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నానని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి రానంత మాత్రాన పార్టీ మారతానా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. భట్టి విక్రమార్క పాదయాత్రే తన పాదయాత్ర అన్న కోమటిరెడ్డి... కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేయాలని కోరతామన్నారు.  కోమటిరెడ్డి వెంకటరెడ్డి దళిత సీఎం ప్రతిపాదనను రేవంత్ రెడ్డి టార్గెట్‌గానే తీసుకొచ్చారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ ప్రతిపాదనతో పార్టీలో రేవంత్ రెడ్డికి  చెక్ చెప్పొచ్చని కోమటిరెడ్డి భావిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.    


మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ సత్యగ్రహా దీక్ష  


 మంచిర్యాల జిల్లా నస్పూర్ నూతన కలెక్టరేట్ సమీపంలోని మైదానంలో కాంగ్రెస్ పార్టీ సత్యగ్రహ దీక్ష సభను ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్, భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం భట్టి పాదయాత్ర మంచిర్యాల జిల్లాలోకి చేరుకోవడంతో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేశారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాట్లు చేశారు. సత్యగ్రహా దీక్ష సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , టీపీసీసీ ఇంఛార్జీ మానిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనున్న పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చారు.  


సీఎల్పి నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా బజార్‌హథ్నూర్‌ మండలంలోని పిప్పిరి గ్రామం నుంచి మార్చి 16న ప్రారంభమై నేడు మంచిర్యాల జిల్లా సత్యగ్రహ సభ వద్దకు చేరుకుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో సత్యగ్రహా సభ వేదిక పైకి భట్టి విక్రమార్కను కాంగ్రెస్ నాయకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు శాలువాలతో సత్కరించారు. అనంతరం సభలో అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా మల్లికార్జున ఖర్గే, మానిక్ రావ్ ఠాక్రే, భట్టి విక్రమార్క , రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రోహిత్ చౌదరీ, పొన్నాల లక్ష్మయ్య, కొప్పుల రాజు,  కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, శబ్బీర్అలీ, వీహెచ్, దామోదర్ రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, అంజనీకుమార్ యాదవ్, బలరాం నాయక్, జావేద్ మహ్మద్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.