YS Sharmila on KCR: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో వైఎస్ షర్మిల  ప్రజాప్రస్థాన యాత్ర సాగుతోంది. ఇందార గ్రామానికి వచ్చిన ఆమెకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్‌కి ఎన్నికలతోనే పని అని, ఎన్నికలు ఉంటేనే ఆయన బయటకు వస్తారంటూ కామెంట్లు చేశారు. గాడిదకు రంగు పూసి.. ఇదే ఆవు అని నమ్మిస్తారంటూ విమర్శలు చేశారు. ఓట్లు వేయించుకొని దొర మళ్ళీ ఫామ్ హౌస్‌కి వెళ్లిపోతారంటూ ఆరోపించారు. మళ్ళీ తిరిగి ప్రజల వైపు చూడరు అని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్.. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటికా బోడి మల్లన్నలా చేస్తారంటూ ఘాటు విమర్శలు చేశారు. అందుకే ఈసారి కేసీఆర్‌కి బుద్ది చెప్పాలన్నారు. వైఎస్సార్ సంక్షేమం పాలన తీసుకొచ్చేందుకే  వైఎస్సార్ తెలంగాణ పార్టీని తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ప్రతి పథకాన్ని అద్భుతంగా అమలు చేసి చూపిస్తామన్నారు. 






బాల్క సుమన్ కాదు బానిస సుమన్..


మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం భీమారం మండల కేంద్రంలో వైఎస్ఆర్టీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా నిర్వహించిన ఈ సభలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కాదు..బానిస సుమన్ అంటూ మండిపడ్డారు. దొర పక్కన కూర్చొనే సరికి దొర పోకడలు వచ్చాయన్నారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఎమ్మెల్యే కాస్త రౌడీ సుమన్ అయ్యారని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఏమయ్యిందని షర్మిల ప్రశ్నించారు. 100 రూపాయలు లేవని చెప్పిన సుమన్ కు ఇవాళ 100ల కోట్లు ఎలా వచ్చాయని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.  సీఎం కేసీఅర్ జన్మలో ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు.  ఈ చెన్నూరు నియోజక వర్గానికి కేసీఆర్ చేసింది మోసమే అని ఆరోపించారు. ప్రాణహిత - చేవెళ్ల ద్వారా ఈ చెన్నూరుకి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుకున్నారని,  ప్రాజెక్ట్ డిజైన్ మార్చి ఈ నియోజక వర్గానికి అన్యాయం చేశారని ఆక్షేపించారు. 


అండర్ గ్రౌండ్ మైనింగ్ ఏమైంది? 


 "గొల్లవాగు ప్రాజెక్ట్ ద్వారా 50 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని అనుకున్నారు. ప్రాజెక్ట్ కట్టిస్తే వైఎస్సార్ కి పేరు వస్తుందని టీఆర్ఎస్ ప్రభుత్వం కాలువలు కూడా తవ్వించడం లేదు. కోల్ బెల్ట్ ఏరియాలో 30 వేల మందికి పట్టాలు ఇవ్వాలని అనుకున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎందుకు ఇవ్వలేకపోయారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ మాత్రమే ఉంటాయని కేసీఆర్ చెప్పి మోసం చేశారు. ఓపెన్ కాస్ట్ ఉండదు అని...కుర్చీ వేసుకొని బంద్ చేస్తా అని అన్నారు. కుర్చీ దొరకలేదు... పైగా ఓపెన్ కాస్ట్ లు 19కి పెంచారు. అండర్ గ్రౌండ్ మైనింగ్ పూర్తిగా బంద్ చేశారు. సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు అన్నారు. ఒక్కరినీ రెగ్యులర్ చేయలేదు. బాస్ డిపో, రెవెన్యూ డివిజన్, మందమర్రి ఎన్నికలు అని మోసం చేశారు."- వైఎస్ షర్మిల