Mahbubnagar local body MLC Election :  మహబుబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది.  ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ జరగింది. . ఈ ఎన్నికల్లో 99.86 శాతం ఓటింగ్‌ నమోదైంది. మొత్తం1439 మందికి గానూ 1437 మంది స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్‌కర్నూలు,నారాయణపేట కేంద్రాల్లో ఇద్దరు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోలేదు. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలకు గానూ 8 కేంద్రాల్లో 100 శాతం ఓటింగ్ నమోదైంది.కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ అఫిషియో ఓటు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఆయన ఓటు వేశారు.

  


క్యాంపుల నుంచి ఓట్లేసిన ఓటర్లు                                           


స్థానిక సంస్థల కోటా ఎన్నికలో మొత్తం 1439 మందికి  ఓటు హక్కు ఉంది.   ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.  1439 మంది ఓటర్లలో 900 మంది  గతంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులే. కానీ.. వీరిలో చాలా మంది ఇప్పటికే హస్తం గూటికి చేరారు. ఇంకొందరు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ కు క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అంచనా వేశారు. 1439 మంది ఓటర్లలో 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు 14 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  ఎమ్మెల్సీ ఉప ఎన్నికకై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. 


ఎక్కువ మంది ఓటర్లు పార్టీ ఫిరాయించడం బీఆర్‌ఎస్‌కు మైనస్                                        


ఓటర్లను రెండు  ప్రధాన పార్టీలు క్యాంపులకు తీసుకెళ్లాయి. ఇతర పార్టీలు ప్రలోభ పెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో  బీఆర్ెస్ క్యాంపులకు వెళ్లిన వాళ్లు కూడా పెద్దగా లేరనన అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే విజయంపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. 


అభ్యర్థులు ఇద్దరూ బలమైన వాళ్లు                                                


అధికార కాంగ్రెస్ నుంచి.. టిటిడి బోర్డు మాజీ మెంబర్ జీవన్ రెడ్డి బరిలో ఉండగా.. బీఆర్ఎస్ తరఫున జడ్పీ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్ గా సుదర్శన్ గౌడ్ పోటీ పడుతున్నారు. ఎలాగైనా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తపన పడుతుండగా.. అధికార కాంగ్రెస్ ఆ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఏ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయో చూడాలి. ఏప్రిల్ 2న ఉపఎన్నిక ఫలితం వెలువడనుంది. పూర్తి స్తాయిలో బలం ఉన్నా.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలినట్లవుతుంది.