kumbham Anil: యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెండు నెలల క్రితం బీఆర్ఎస్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తాజాగా సొంతగూటికి చేరుకున్నారు. సోమవారం రోజు రాత్రి తిరిగి హస్తం పార్టీలోకి వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ లోని అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీలోకి తిరిగి రావాలని ఆహ్వానించారు. దీంతో ఆయన వెంటనే మరోసారి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. డీసీసీ అధ్యక్షుడి హోదాలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరినప్పటికీ... అనిల్ కుమార్ రెడ్డి అక్కడ ఇమడలేకపోయారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత సరైన గుర్తింపు, ప్రజల్లోకి వెళ్లడానికి ప్రొటోకాల్ లేదన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈక్రమంలోనే తీవ్ర అసంతృప్తికి గురైన ఈయన మళ్లీ సొంతగూటికే వెళ్తారన్న మాట వినిపించింది. 




ఈక్రమంలోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. అనిల్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించగానే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి.. అనిల్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం తాను చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకున్నానని వివరించారు. మరోవైపు ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుసుకున్న బీఆర్ఎస్ మంత్రులు.. అనిల్ కుమార్ రెడ్డితో మాట్లాడేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ అవేవీ ఫలించలేదు. 


Read Also: Adilabad News: బీఆర్ఎస్‌ను వీడనున్న మరో ఎమ్మెల్యే? కాంగ్రెస్‌లోకి వెళ్లే ఛాన్స్!