KTR on Telangana High Court Verdict: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. రాబోయే నాలుగు వారాల్లోగా ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తోందని, ఇది ఆ పార్టీకి చెంప దెబ్బ అని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.


కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ హామీని తుంగలో తొక్కి తెలంగాణలో ఫిరాయింపులను మళ్లీ ప్రోత్సహిస్తోందని అన్నారు. తద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అపహాస్యం చేసిందని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి ఫిర్యాదులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ స్పీకర్ చర్యను ప్రారంభించడంలో విఫలమయ్యారని, అందుకే బీఆర్‌ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.






హరీశ్ రావు కూడా స్పందన


ఎమ్మెల్యేల అన‌ర్హత పిటిష‌న్‌ల‌పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నాం. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త అప్లికేష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యం. తెలంగాణ హైకోర్డు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టే విధంగా ఉంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం త‌థ్యం. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ గెలుపు త‌థ్యం. హైకోర్డు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర శాస‌న‌స‌భాప‌తి నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నాం’’ అని హరీశ్ రావు స్పందించారు.