KTR Reaction on Kavitha Party:  కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని ప్రకటించడంపై కేటీఆర్ భిన్నంగా స్పందించారు. తెలంగాణలో చాలా పార్టీలు వచ్చాయి..పోయాయని.. పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కవన్నారు. కేసీఆర్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారని వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కార్యవర్గ సమావేశం తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.                             

Continues below advertisement

పార్టీలో అంతర్గతంగా ఎవరైనా సూచనలు ఇవ్వవచ్చని, అంతమాత్రాన విభేదాలు ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఒక ప్రజాస్వామ్య పార్టీ అని, నాయకుల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో పార్టీని మళ్ళీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే కొత్త కమిటీల నియామకం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.  

తెలంగాణ ఏర్పాటును అవమానిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్‌లో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తాను వ్యక్తిగతంగా ఫోన్ చేసి హెచ్చరించినట్లు కేటీఆర్ వెల్లడించారు.  తెలంగాణ అస్థిత్వాన్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోం.. ఆయన తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకున్నప్పటికీ, బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే  అని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.

Continues below advertisement

 రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ధాన్యం సేకరణలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరిచి, రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లించాలని అల్టిమేటం జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యం జరిగితే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. రైతుల పక్షాన పోరాడటమే తమ పార్టీ మొదటి ప్రాధాన్యత అని  కాంగ్రెస్ తన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు.