Supreme Court on live in relationship: లివ్-ఇన్ రిలేషన్షిప్లు విఫలమైనప్పుడు, ఆ పరిణామాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించలేమని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ దాఖలైన ఒక అత్యాచార కేసును విచారించిన జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని బెంచ్, పరస్పర అంగీకారంతో సాగే ఇటువంటి సంబంధాల్లో ఉండే చట్టపరమైన చిక్కులు , అనిశ్చితిపై సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
సహజీవనం ఒక చట్టపరమైన రిస్క్
చాలా ఏళ్ల పాటు కలిసి ఉండి, ఆ తర్వాత విడిపోయినప్పుడు మహిళలు పురుషులపై లైంగిక దాడి ఫిర్యాదులు చేయడం ఇప్పుడు పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వివాహేతర బంధాల్లో ఇలాంటి అనిశ్చితులు సహజం. పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్నప్పుడు భాగస్వాములు ఎప్పుడైనా విడిపోయే అవకాశం ఉంటుంది. పరస్పర అంగీకారంతో బంధాన్ని కొనసాగించినప్పుడు, అది విఫలమైతే నేరం ఎలా అవుతుంది అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒకవేళ వివాహం జరిగి ఉంటే, ద్వితీయ వివాహం కింద కేసు పెట్టవచ్చని లేదా భరణం కోరవచ్చని, కానీ సహజీవనంలో అటువంటి హక్కులు పరిమితమని గుర్తుచేసింది.
పిల్లలు ఎప్పటికీ అక్రమం కాదు
బాధితురాలు తాను మోసపోయానని, సదరు వ్యక్తికి ఇదివరకే వివాహమైందని వాదించగా.. కోర్టు ఆమెపై సానుభూతి వ్యక్తం చేస్తూనే, చట్టపరమైన కోణాన్ని వివరించింది. అయితే, వీరి బంధం వల్ల కలిగిన సంతానం విషయంలో కోర్టు మానవీయ కోణంలో స్పందించింది. తల్లిదండ్రుల బంధం చట్టవిరుద్ధం కావొచ్చేమో కానీ, పుట్టిన బిడ్డ మాత్రం ఎప్పటికీ అక్రమం కాదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ శిశువు సంరక్షణ కోసం తండ్రి నుండి మెయింటెనెన్స్ కోరే హక్కు బిడ్డకు ఉంటుందని స్పష్టం చేసింది.
మధ్యవర్తిత్వమే మార్గం..
ఇలాంటి సున్నితమైన కేసుల్లో కఠినమైన క్రిమినల్ చర్యల కంటే, ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని సుప్రీంకోర్టు సూచించింది. వివాద పరిష్కారం కోసం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించాలని ఇరు పక్షాలకు సలహా ఇచ్చింది. ఆధునిక కాలంలో మారుతున్న సామాజిక పోకడలతో, సహజీవనం చేసేవారు అందులోని చట్టపరమైన రక్షణలు , పరిమితులపై అవగాహన కలిగి ఉండాలని ఈ తీర్పు హెచ్చరికగా నిలుస్తోంది.
