ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణా పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీని నరెంద్రమోదీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కార్యకర్తలదేనని కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో ఆయన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీపై విరుచుకు పడ్డారు. అసలు ప్రధాని మోదీకి నీతి ఉందా అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్‌ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతిఆయోగ్ సిఫారసు చేస్తే ఒక్క రూపాయికూడా ఇవ్వలేదన్నారు.  2014లో జన్‌ధన్ ఖాతాల్లో రూ. పదిహేను లక్షలు వేస్తామని హమీ ఇచ్చారని.. కానీ ఎక్కడా  15లక్షలు కాదు 15 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. 


ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యింది ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని కోటలు దాటే మాటలు చెప్పి..ఒక్క ఉద్యోగమైనా ఇవ్వలేదన్నారు. .16కోట్ల ఉద్యోగాలు రావాలని అదేమని అడిగితే మిర్చి బండి కూడా ఉద్యోగమే అంటున్నారని విమర్శించారు. మోదీ పరిస్థితి బాత్‌ కరోడోమే..కామ్‌ పకోడీమే అన్నట్లు ఉన్నదని సెటైర్ వేశారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే అని మనం ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. జీవితాలు మార్చమని ఓట్లు వేస్తే జీవిత భీమానే అమ్మేస్తున్నారని ..మనం ఇది ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్ కాదు..సబ్‌కా సాథ్‌ సబ్‌ బక్‌వాస్‌ అని ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేని దిశానిర్దేశం చేశారు. 


కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్‌ గెలిచి మూడేళ్లు అయ్యింది అయన నియోజకవర్గానికి నయా పైసా అయిన తీసుకురాలేదన్నారు.  అయోధ్యలో మాత్రమే రాముడున్నాడా..మా వేములవాడలో లేడా..మరి మాకెన్ని పైసలు ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు. నరెంద్రమోదీ కేవలం ఉత్తర భారతానికి ఉత్తరాఖండ్‌కే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారని ..తెలంగాణాకు ప్రధాని వేరే ఎవరైనా ఉన్నారా అని కార్యకర్తలు ప్రశ్నించాలన్నారు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మేడారం ను మినీ కుంభమేళా అంటారు మరి ఇచ్చింది ఎంత రెండున్న కోట్లు మాత్రమేనన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కుంభమేళాకు 375 కోట్లు ఇచ్చారన్నారు. 


ఎనిమిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు 158 మంజూరు చేస్తే తెలంగాణాకు ఇచ్చింది సున్నా అని.. 8 ఐఐఎం,16 ఐఐఐటీలు ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు.  మరి బండి ఇక్కడికి వచ్చి బండి పోతే బండి .. గుండుపోతే గుండు ఫ్రీ అని గొప్పగొప్ప మాటలు చెప్పారన్నారు. బీజేపీ అంటే బక్వాస్‌ జ్యాదా ఝూటా పార్టీ అని ప్రచారం చేయాల్సిందేనన్నారు. కేసీఆర్‌ కంటే గొప్ప హిందువు ఎవరు లేరు..ఆయన యధాలాపంగా హిందూగాళ్లు బొందుగాళ్లు అన్నమాటను రచ్చచేసి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. బీజేపీ బట్టలు విప్పి బజారులో నగ్నంగా నిలబెట్టాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని పిలుపునిచ్చారు. బీజేపీ వాళ్లు అడ్డందిడ్డం మాట్లాడితే జనగామ, ఆర్మూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు వీపు పగులగొట్టిన్రు..ఇక సిరిసిల్లలో కూడా అదే పని చేయాలని పిలుపునిచ్చారు.