ACB Chargesheet Formula E Race Hyderabad: తెలంగాణ రాజకీయంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విచారణలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని సమన్లు జారీ చేయడంతో, కేటీఆర్తో పాటు మిగిలిన నిందితులు కోర్టు ముందు హాజరుకావాల్సి వచ్చింది. న్యాయస్థానం దర్యాప్తు ప్రక్రియలో భాగంగా నిందితులకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసింది.
ఈ కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ . హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి కోర్టు ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వీరంతా రూ.లక్ష పూచీకత్తు తో పాటు ఇద్దరు వ్యక్తుల షూరిటీలను కోర్టుకు సమర్పించి నిబంధనలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. కేటీఆర్ కోర్టుకు వచ్చే సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నాంపల్లి కోర్టు ప్రాంగణానికి చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ సీజన్-10కు సంబంధించి ఆర్థిక అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఏసీబీ అభియోగాలు నమోదు చేశారు. కేబినెట్, ఆర్థిక , న్యాయ శాఖల ముందస్తు అనుమతులు లేకుండానే యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా రూ.55 కోట్లకు పైగా నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో దాదాపు 77 పేజీల విస్తృత ఛార్జ్షీట్ను దాఖలు చేసిన ఏసీబీ, 14 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొంది.
ఏసీబీ మోపిన అభియోగాలను కేటీఆర్ , బీఆర్ఎస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా, ఆటోమొబైల్ హబ్గా నిలబెట్టేందుకే సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందులో ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేదా నిధుల దుర్వినియోగం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తమపై తప్పుడు కేసులు బనాయించిందని ఆయన మండిపడ్డారు. కుట్రపూరిత కేసులు తమ పోరాటాన్ని ఆపలేవని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
కోర్టులో విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం కేటీఆర్ నాంపల్లి కాంప్లెక్స్ నుండి వెళ్లిపోయారు. ఈ విచారణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి ఏసీబీ కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విచారణను ఆగస్టు 25కు వాయిదా వేయడంతో, ఆ రోజు కోర్టు ఏ రకమైన ఆదేశాలు ఇస్తుందనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.
