BRS News: కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ  ఫిరాయింపులకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హాయాంలోని కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. 2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసిందని అన్నారు. అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్ తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 


‘‘2014 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు. తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్ ను పడగొట్టే ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు. 


మగాడివైతే రాజీనామా చేయించు - కేటీఆర్
రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలే? ఎవరు పిచ్చి కుక్క? ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్ ను కొట్టాలా? రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్. వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్ లోనే చెప్పిండు. పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమిటీ ప్రజలు గుర్తించాలె. 


వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది. 14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు? మోదీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు. దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమి లో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది. ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే కాదు. ఏ కూటమిలో లేని సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్ లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.


కుండ పగిలితే పగిలింది.. కానీ కుక్క బుద్ది తెలిసింది - కేటీఆర్
420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు. వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు. అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు. ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు. జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది. జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు. జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. గాలికి కొట్టుకుపోయేటివి గడ్డిపోచలే.  గడ్డపారాలు కొట్టుకుపోవు. ఇక్కడ ఎమ్మెల్యే గడ్డిపోచలాంటి వ్యక్తి. కవితక్క సహా మీరందరూ కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. కానీ దొంగలల్లా కలిసి పోయిండు. రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోయిండు. కుండ పగిలితే పగిలింది. కానీ కుక్క బుద్ది తెలిసిందన్నట్లుగా మీ ఎమ్మెల్యే బుద్ది తెలిసింది’’ అని కేటీఆర్ మాట్లాడారు.