Krishna Tribunal: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల నీటి వినియోగంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కృష్ణా ట్రైబ్యునల్ కొట్టివేసింది. 90 టీఎంసీల నీటిని వాడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపాలని ఏపీ ఇంటర్ లొకేటరీ వేసిన అప్లికేషన్ పై విచారణ అధికారం తమకు లేదని కృష్ణా ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. 2022 ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇచ్చిన జీవో 246 పై స్టే ఇవ్వాలని ఏపీ సర్కారు పిటిషన్ వేసింది. దీనిపై కృష్ణా ట్రైబ్యునల్ లో జులై 14వ తేదీ వరకు వాదనలు జరిగాయి. ఇవాళ ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది ఉత్తర్వులు వెల్లడించింది. ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ పై విచారణ అధికారం ట్రైబ్యునల్ కు లేదని.. తగిన వేదికలను ఆశ్రయించాలని తుది ఉత్తర్వుల్లో పేర్కొంది. 


ఇది పాలమూరు విజయం: నిరంజన్ రెడ్డి


పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఏపీ సర్కారు పిటిషన్ పై కృష్ణా ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పు గురించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఇది పాలమూరు విజయంగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ పై కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును మంత్రి నిరంజన్ రెడ్డి స్వాగతించారు. 


పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల వరకు కృష్ణా జలాలు తీసుకోవచ్చని నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఇప్పటికే కేంద్ర అటవీ, పర్యావరణ, మోటా, కేంద్ర భూగర్భ జలశాఖ, విద్యుత్ ప్రాధికార సంస్థ, కేంద్ర మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ లాంటి అన్ని సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు పొందినట్లు గుర్తు చేశారు. ట్రైబ్యునల్ తీర్పు ద్వారా సబ్ జ్యూడిస్్ అడ్డంకి తొలగిపోయిందని అన్నారు. ఈ ప్రాజెక్టులో ఉన్న మరిన్ని అడ్డంకులను కేంద్ర సర్కారు గుర్తించ వీలైనంత తక్కువ సమయంలో వాటిని కూడా తొలగించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కోరారు. కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను కూడా వెంటనే తేల్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా విషయంలో సీఎం కేసీఆర్ పట్టుదలే ఈ విజయానికి కారణమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.


ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్


నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలహారతి పట్టారు. అతి పెద్ద మహా బలి మోటార్ ద్వారా శ్రీశైలం జలాశయం వెనుక జలాల నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా హెడ్ రెగ్యులేటరీ, ఇంటెక్ వెల్, సొరంగ మార్గాల ద్వారా సజ్జపూల్‌లోకి చేరిన కృష్ణా జలాలు….. మొదటి పంపు నుంచి డెలివరీ మెయిన్స్ ను దాటుకొని నార్లాపూర్‌ జలాశయానికి విజయవంతంగా చేరుతాయి. భూగర్భంలో పంపుహౌజ్‌ ఏర్పాటు చేశారు.