Congress Warangal Leaders : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో  మరో వికెట్ పడింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాంగ్రెస్ గూటికి చేరారు. రెండు నెలలుగా సారయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చివరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సారయ్య చేరిక తో వరంగల్ లో రాజకీయ అలజడి మొదలైంది. 


కాంగ్రెస్‌లో చేరిపోయిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య 


ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా, మాజీ మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజు సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన సారయ్య 1999 నుండి 2009 వరకు వరుసగా మూడుసార్లు గెలిచారు. 2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా చేశారు. 2014 ఎన్నికల్లో  బీ అర్ ఎస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయారు. అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా 2016 లో బీ అర్ ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందనుకున్నాను. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండా సురేఖ, సారయ్య ను కాదని అప్పటి మేయర్ నరేందర్ కు  వరంగల్ తూర్పు టిక్కెట్ ఇచ్చారు. దీంతో సురేఖ తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళగా. సారయ్య కు 2020 లో కే సీ ఆర్ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇచ్చారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సారయ్య స్వంత గూటికి చేరుకున్నారు.


చేరికలపై అసంతృప్తిలో కొండా సురేఖ 


బస్వరాజు సారయ్య కాంగ్రెస్ లో చేరికతో  రాజకీయ అలజడి మొదలైంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు.  ఆపరేషన్  ఆకర్ష్‌ లో భాగంగా బీ అర్ ఎస్  నుండి కాంగ్రెస్ లోకి నేతలు క్యూ కడుతున్నారు. మంత్రి  సురేఖ చేరిక ల పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు బహిరంగంగానే మాట్లాడుతున్నారు.  సొంత నియోజకవర్గ వరంగల్ తూర్పు తో పాటు కొండ సురేఖ పాత నియోజకవర్గం పరకాలలో తనకు తెలియకుండా ఎలా పార్టీలో కి చేర్చుకుంటారని   గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో సారయ్య కాంగ్రెస్ లో చేరడంతో కొండా సురేఖ అంతర్మానంలో పడింది. ఇప్పటికే సురేఖ కొత్తగా వచ్చిన నేతలను  కలుపుకొని పోక పోవడం, దూరంగా పెట్టడంతో రాజకీయ దుమారం కొనసాగుతుంది. కొండా సురేఖ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వసంతృప్తి తో ఉన్నారట. ఇదే సమయంలో బసవరాజ్ సారయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తూర్పు నియోజకవర్గంలో రాజకీయ అలజడి మొదలైందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి సైతం అనేకసార్లు కొండ దంపతులను మందలించినట్టు సమాచారం.


మంత్రి సురేఖ ప్రాధాన్యం తగ్గించడానికేనా ? 


సారయ్య ను సైతం కొండా సురేఖకు తెలియకుండానే పార్టీలోకి తీసుకువచ్చారనే ప్రచారం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగర పర్యటన రోజే సారయ్య చేరిక ఖరారైంది. ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సారయ్య తో మంతనాలు జరిపారు. బస్వరాజు సారయ్య  వరంగల్ తూర్పు నియోజకవర్గం తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు. హంగు  ఆర్భాటాలని లేని నాయకుడిగా నిత్యం ప్రజల్లో ఉండే నేతగా సారయ్య కు మంచి గుర్తింపు ఉంది.


వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు, నేతలు పార్టీలతో సంబంధం లేకుండా   నిత్యం కలిసి వెళ్తుంటారు.   ఈ కోణంలోనే కొండా సురేఖకు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా సారయ్య ను తీసుకువచ్చారనే ప్రచారం జోరుగా సాగుతుంది. సారయ్య రాకతో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ లో జోష్ పెరిగిందని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో కొండా సురేఖ, సారయ్య మధ్య రాజకీయ వార్ కొనసాగక తప్పదని చెప్పవచ్చు.