Komatireddy In Delhi : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీలతో సమావేశం అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులు, మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రపై చర్చించారు. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతానని సోనియా చెప్పారని భేటీ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు. భట్టి పాదయాత్ర, ప్రియాంక సభలపై చర్చించామన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి తెలంగాణకు రావాలని ప్రియాంకను కోరామని కోమటిరెడ్డి తెలిపారు. తెంగాణ కాంగ్రెస్ నేతల్లో విబేధాలు లేవని.. తాము అంతా కలిసిపోయామని అగ్రనేతలకు చెప్పామన్నారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోనియాకు చెప్పానని... ఒకరి పాదయాత్రకు మరొరకం సహకరిస్తున్నామన్నారు.
తెలంగాణ లో గెలుపు బాధ్యతల్ని ప్రియాంక తీసుకుంటారని ప్రచారం
తెలంగాణ కాంగ్రెస్ .. కర్ణాటకలో తమ పార్టీకి లభించిన విజయంతో ప్రియాంక గాంధీకి తెలంగాణ బాధ్యతలు కూడా అప్పచెబుతున్నారన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. ప్రియంకా కూడా రెడీ అయిపోయారు. ప్రియాంకా గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తర ప్రదేశ్ బాధ్యతలు చూస్తున్న ప్రియాంకా గాంధీ ఆ బాధ్యతలు నుంచి వైదొలిగారు.తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి సమస్య వచ్చినా నేతలు ప్రియాంకా గాంధీ వద్దకే వెళ్తున్నారు. తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి.. త్వరలో టీ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ భేటీ కానున్నట్లుగా చెబుతున్నారు.
ప్రియాక ప్రచారం చేసిన చోట్ల మంచి ఫలితాలు
హిమాచల్, కర్ణాటక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, సభలతో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపుకు ఇది దోహదపడిందని చెబుతున్నారు. తెలంగాణలో అయితే ప్రియాంక ప్రభావం ఎక్కువగా ఉంటుందని... పూర్తిగా ఆమెకే బాధ్యతలు అప్పగించాలని పార్టీ నేతలు కూడా కోరుతున్నారు. కొంత కాలంగా తెలంగాణ ఇంంచార్జ్ గా ప్రియాంక గాంధీని నియమిస్తారన్న ప్రచారం ఉంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా తెలంగాణ నేతలుతమకు ఏ సమస్య వచ్చినా ప్రియాంకా గాంధీ వద్దకే వెళ్తున్నారు. ప్రియాంక కూడా యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ఆమె తెలంగాణ నుంచి కూడా పోటీ చేస్తారనిప్రచారం చేస్తున్నారు. అయితే అంత ధైర్యం చేయకపోవచ్చని అంటున్నారు. ఇప్పుడు టీ కాంగ్రెస్ పూర్తిగా... ప్రియాంక గాంధీపై ఆశలు పెట్టుకున్నట్లయింది.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ లో మెరుగుపడిన పరిస్థితులు
తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లుగా కనిపిస్తోంది. నేతల మధ్య ఆధిపత్య పోరాటం పెద్దగా బయటకు రావడం లేదు. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హైకమాండ్ ను కలిసి తమ మధ్య విబేధాలేమీ లేవని..కలిసి పని చేస్తున్నామని చెప్పడం కీలకంగా మారింది.