Telangana News: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఈ విషయంలో తమకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు ఇవ్వాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తెలంగాణా భవన్లో కలిశారు. దుద్యాల్ మండలంలోని హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వారు కేటీఆర్ కు వివరించారు. 


కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తో కలిసి కేటీఆర్ ను కలిశారు మహిపాల్ ముదిరాజ్ మరియూ ఇతర నాయకులు. ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ సీఎం అన్న తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని తమకు బీఆర్ఎస్ అండగా నిలవాలని కేటీఆర్ ను కోరారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుందన్నారు. 


వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమినే జీవనాధారం అని... ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.  తప్పకుండా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.