Kodandaram :    మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమయిందని తెలంగాణ జన సమితి నేత  ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఆయన సీఈవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.  అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఈ ఉప ఎన్నికలు నిలవనుండగా మద్యం,డబ్బు ప్రవాహన్ని అడ్డుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని ఆరోపిస్తూ  ప్రోఫెసర్‌ కోదండరామ్‌ ఆందోళన ప్రారంభించారు. అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుద్ద భవన్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో కోదండరాం మౌన ప్రదర్శనకు దిగారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా విచ్చల విడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యంగ బద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు.


మునుగోడులో అక్రమాలను అరికట్టడం లేదన్న కోదండరాం


మునుగోడులో ప్రచారం చివరి దశకు చేరుకుంటోంది. ఎన్నిక సమయం దగ్గరపడే కొద్దీ ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కొందరు నేతలు ఎన్నికల రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈసీకి పలు పార్టీల నేతలు ప్రతీ రోజూ ఫిర్యాదు చేస్తున్నారు. మునుగోడులో జరగుతున్న ప్రభుత్వ అక్రమాలు, ఎన్నికల నియమాల ఉల్లంఘనపై కోదండరాం పార్టీకి చెందిన నేతలు కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయనా పట్టించుకోలేదు. చివరికి దర్నాకు దిగారు. ఎన్నికల నిబంధనలు పూర్తిగా గాలికొదిలేశారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


మునుగోడు బరిలో టీజేఎస్ అభ్యర్థిగా  పల్లె వినయ్ కుమార్


పార్టీల నేతలు నువ్వు ఒక్కటి ఇస్తే నేను రెండిస్తా అంటూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉన్నారని కోదండరాం మండిపడ్డారు. డబ్బులు, మద్యాన్ని ఏరులై పారిస్తూ.. నోట్ల కట్టలతో ఓట్లు రాల్చుకునేందుకు నానా పాట్లు పడుతున్నారని అన్నారు. మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. 6న ఫలితాన్ని వెల్లడిస్తారు. టీ‌జే‌ఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు .


మునుగోడులో పోటీ పడి డబ్బులు ఖర్చు పెడుతున్న పార్టీలు 


మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికల్లో ఒకటిగా మారింది. పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు డబ్బులు ఖర్చు చేస్తున్నాయి. మునుగోడుకు తరలిస్తున్న రూ. పదిహేను కోట్ల వరకూ డబ్బులను వివిధ సందర్భాల్లో పట్టుకున్నారు. అయితే  విపక్ష పార్టీలవే పట్టుకుంటున్నారని..  టీఆర్ఎస్ నేతల కార్లను పోలీసులు సోదాలు చేయడం లేదని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ధర్నాలకు దిగుతున్నాయి.