Kishan Reddy: తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే 80 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మన్సూరాబాద్‌లో మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్రస్థాయి సమ్మేళనంలో కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అలాగే మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌లో నిర్వహించిన బీజేవైఎం రాష్ట్రస్థాయి సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. 


దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌, ఎన్నికల ఫలితాలు వెలువడగానే వారికి వెన్నుపోటు పొడిచి దగా చేశారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. దళితబంధు పేరుతో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను నిర్విర్యం చేశారని మండిపడ్డారు. ఈ నెల 17న పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించడానికి బీఆర్‌ఎస్‌ను, దేశంలో గాంధీ కుటుంబ పాలన రాకుండా కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ డీఎన్‌ఏ ఒక్కటేనన్నారు. బుధ, గురువారాల్లో నిరుద్యోగ దీక్ష, 15న హైదరాబాద్‌– పరకాల బైక్‌ ర్యాలీ ఉంటాయని తెలిపారు. ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత కన్నీరు పెడుతోందని ఆవేదన చెందారు. 


హైదరాబాద్ విమోచన దినంగా నిర్వహించాలి
ఈ నెల 17ను హైదరాబాద్‌ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. నిజాం రాక్షస పాలనపై వేలాదిమంది యువకులు, మహిళలు పెద్దఎత్తున పోరాడారని, ప్రాణాలు కోల్పోయారని అది సమైక్యతా దినోత్సవం ఎలా అవుతుందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. హైదరాబాద్‌ ముక్తి దివస్‌ పేరిట కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.


కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలతో, మజ్లిస్‌కు వంతపాడుతూ సీఎం కేసీఆర్‌ విమోచన దినోత్సవ చరిత్రను కాలరాస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అనుమతి ఉంటేనే కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎద్దేవా చేశారు. విమోచన దినోత్సవం నిర్వహించని మొదటి ద్రోహి కాంగ్రెస్‌ అయితే రెండో ద్రోహి బీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు. తమకు గ్రౌండ్‌ ఇవ్వలేదని కాంగ్రెస్‌ పార్టీ నేతలు మూర్ఖత్వంతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ఆధ్వర్యంలో అక్కడ విమోచన దినోత్సవాలను నిర్వహించుకోవాలని నిర్ణయిస్తే.. దాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్, ఇతర పార్టీలు కుట్ర చేస్తున్నాయని నిందించారు. 


17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో కేంద హోంమంత్రి అమిత్‌ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఇందులో పాల్గొనాలని తెలంగాణతో సహా కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ స్టేట్‌ విమోచనకు సంబంధించి చారిత్రక పరిణామాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ ఈ సారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా పాల్గొంటారని వెల్లడించారు. విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా.. రాష్ట్రంలోని సర్పంచ్‌లకు లేఖలు రాస్తున్నట్టు తెలిపారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా అరెస్ట్‌కు సంబంధించిన  పూర్తి సమాచారం తమ వద్ద లేదని, స్పందించలేనని కిషన్‌రెడ్డి బదులిచ్చారు.