BRS Party : తిరుగుబాటు నేతలపై బీఆర్ఎస్ పార్టీ వేటు వేసింది. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి చెందిన 20 మంది ముఖ్య నాయకులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రకటించింది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి పార్టీపై బహిరంగంగా విమర్శలు చేయడంతో వ్యవహారం మరింత ముదిరింది. తిరుగుబాటు చేసిన పొంగులేటి వర్గంపై బహిష్కరణ  నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ అధిష్టానం. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ ఛైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, వైరా మున్సిపల్ ఛైర్మన్‌ జైపాల్‌తో పాటు మరో 18 మందిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌ చేసింది. కొన్ని రోజులుగా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి బీఆర్ఎస్ అధిష్ఠానంపై విమర్శలు చేస్తున్నారు. మండల స్థాయి నాయకులను తనవైపు తిప్పుకునేందుకు పొంగులేటి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఆదివారం 5 మండలాల బీఆర్ఎస్ నేతలు పొంగులేటితో భేటీ అయ్యారు. వీరిలో పలువురు ముఖ్య నేతలు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఈ సమావేశంపై దృష్టి సారించిన బీఆర్ఎస్ అధిష్ఠానం బహిష్కరణ అస్త్రం ప్రయోగించింది. పొంగులేటితో సమావేశమైన నేతలను సస్పెండ్‌ చేసినట్లు ఆ మండలాల పార్టీ అధ్యక్షులు ప్రకటించారు. 


బీజేపీ వైపు చూపులు కానీ 


చైతన్యవంతమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత నాలుగేళ్లుగా పదవులు లేకపోయినా పార్టీలో ఉన్న పొంగులేటి అన్ని నియోజకవర్గాల్లో సొంత నేతలకు తలనొప్పిగా మారారు. తనకంటూ ప్రత్యేక క్యాడర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, పొంగులేటి వర్గానికి మధ్య తరుచూ గొడవలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం క్రమంగా పొంగులేటి ప్రాధాన్యత తగ్గించింది. తనకు మునుపటి పరిస్థితులు పార్టీలో వస్తాయని భావించిన పొంగులేటి ఇప్పటి వరకు వేచి చూశారు. పరిస్థితులు మారకపోగా... తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగిపోయాయి. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.  తన అనుచరగణంతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పార్టీ మారేందుకు సిద్దమైనట్లు సంకేతాలు ఇచ్చారు పొంగులేటి. తనతో వచ్చేవారికి పోటీ చేసే అవకాశం ఉంటుందనీ, ప్రజాప్రతినిధులుగా అయ్యే ఛాన్స్ వస్తుందని పరోక్షంగా అనుచరగణానికి సంకేతాలు ఇస్తున్నారు. అయితే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పొంగులేటికి ఇప్పుడు తన అనుచరగణం నుంచే వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.


ఆచితూచి అడుగులు 


తన రాజకీయ భవిష్యత్‌పై ఆచితూచి అడుగులు వేస్తున్నారు పొంగులేటి. ఒక వైపు కమలం గూటికి వెళ్లాలనే ఉన్నా... అనుచరులు అత్యధికులు ఆసక్తి చూపకపోవడం ఒక ఎత్తైతే, ఖమ్మం జిల్లాలో మూడే జనరల్ సీట్లు ఉన్నాయి. అసెంబ్లీకి పోటీ చేయాలంటే పాలేరు, ఖమ్మం, కొత్తగూడెంలో ఎక్కడ నుంచో పోటీ చేయాలి. పాలేరు ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యేల కందాళ ప్రభాకర్ రెడ్డికి మళ్లీ టిక్కెట్ గ్యారెంటీ అని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ గట్టిచెబుతున్నారు. ఈసారి ఎలాగైనా పోటీ చేస్తానని ఆత్మీయులతో చెబుతున్నారు మాజీ మంత్రి, పాలేరు మాజీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్ష్యురాలు వైఎస్ షర్మిల కూడా పాలేరు నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఇక్కడ పొంగులేటి బరిలోకి దిగితే ఏంటీ పరిస్థితి అని అంచనా వేస్తున్నారు.  


 విజయమ్మతో భేటీ 


పొంగులేటి తాను ఏ పార్టీలో చేరినా ఖమ్మం జిల్లాలో తన మాట చెల్లాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు రెడీ అయిన ఆయన ముందుగా బీజేపీలో చేరాలని భావించారు. కానీ, కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోరు సాగుతున్న ఖమ్మం జిల్లాలో బీజేపీకి చేరడం అంత శ్రేయస్కరం కాదని అనుచరులు సూచించారు. వామపక్ష, కాంగ్రెస్, గులాబీ పార్టీకే అక్కడ ప్రజలు మద్దతుగా ఉండే అవకాశం ఉందంటూ సర్వేలు తెలుపుతున్నాయి. దీంతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తల్లి విజయమ్మతో ఆయన భేటీ అయ్యారు. జిల్లాలో పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో అక్కడ తప్ప ఇతర నియోజకవర్గాల్లో పొంగులేటి మద్దతు దారులకు సీట్లు ఇచ్చే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే బాగుంటుందని ఆయనను కోరగా ఆ విషయంపై నిర్ణయం తీసుకోలేదు.