Central Cabninet :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ లో ఇచ్చిన హామీ మేరకు నిజమాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రి వర్గం నిర్ణంయం తీసుకుంది.  తెలంగాణలో పసుపు బోర్డు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కిషన్  రెడ్డి వెల్లడించారు. అలాగే   తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.  ప్రధాని ప్రకటించిన రెండ్రోజులకే గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ఈ బిల్లుపై నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో రూ. 900 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్సిటీకి గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారక్క పేర్లను పెట్టారు.    ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ వాటాలు తేల్చాలని ట్రైబ్యునల్ కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కొత్త నిబంధనలు రూపొందించాలని ట్రైబ్యునల్ ను కేంద్రం ఆదేశించింది. కృష్ణా జలాల్లో తమ వాటా తేల్చాలని తెలంగాణ కోరుతున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం కొలిక్కిరానుంది.


తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ బీజేపీపై తెలంగాణ విషయంలో ఈ మూడు అంశాల్లోనే తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. పసుపు బోర్డు హామీ.. బీజేపీ చాలా సార్లు ఇచ్చింది. గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ధర్మపురి అర్వింద్ బీజేపీని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని రైతులకు బాండ్ కూడా రాసిచ్చారు. కానీ తర్వాత స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేయడంతో  బీజేపీపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో బీజేపీ ముఖ్య నేతలందరూ వచ్చి పసుపుబోర్డు హామీ ఇచ్చారు.. పార్లమెంట్ లోనూ పసుపుబోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ లో కూడా ఆమోదించారు. గిరిజన వర్శిటీ చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. ఇది విభజన చట్టంలలో హామీ. ఎన్నికలకు వెళ్లే ముందు ఈ హామీని నెరవేరస్తూ నిర్ణయం తీసుకున్నారు. 


ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకం జరగాల్సి ఉంది.  2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి.ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు.  విభజన చట్టం కింద కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డే నీటిని పంచుతోంది. అయితే  విడిపోయిన తరువాత నీటి పంపకాలు కూడా కొత్తగా చేపట్టాలని తెలంగాణ కోరింది. అంతకుముందు తీర్పుల సమయంలో తెలంగాణలేదు కాబట్టి, తెలంగాణ వాదన వినేలా కొత్త ట్రిబ్యునల్ కావాలని తెలంగాణ వాదించింది. అందుకోసం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని 2014లో కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. లేదంటే ఉన్న ట్రిబ్యునలే కొత్తగా నీటి పంపకాలు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడా డిమాండ్ ను అంగీకరించి కేంద్రం కొత్త ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసింది.