KCR recovers from fever:  నీరసం, జ్వరంతో ఆస్పత్రిలో చేరిన భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ కోలుకున్నారు.  తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో ఆస్పత్రిలోనే ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. ప్రజా సమస్యల గురించి చర్చించారు. యూరియా కొరత అంశం గురించి పార్టీ నేతల్ని అడిగి తెలుసుకున్నారు.  పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్   ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
 

Continues below advertisement





కేసీఆర్ గురువారం సాయంత్రం తీవ్ర జ్వరంతో యశోధా ఆస్పత్రికి వచ్చారు. ఆయనకు పరీక్షలు చేసిన   డాక్టర్లు రెండు రోజులు ఆస్పత్రిలో  అడ్మిట్ కావాలని సూచించారు. సుగర్ లెవల్స్ ఎక్కువగా.. సోడియం లెవల్స్ తక్కువగా ఉన్నట్లుగా పరీక్షల్లో తేలడంతో వాటిని సాధారణ స్థాయికి తెచ్చే ట్రీట్ మెంట్ ఇచ్చినట్లుగా మెడికల్ బులెటిన్ విడుదల చేశారు. ఉదయం కేటీఆర్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లారని.. రెండు రోజులు ఆస్పత్రిలో ఉండమని డాక్టర్లు సూచించారని తెలిపారు.





అంతకు ముందు ఉదయం కల్వకుంట్ల కవిత కూడా కేసీఆర్ ను పరామర్శించి వెళ్లారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించారు. మేమిద్దరం కలిసి టిఫిన్ చేశారని.. కేసీఆర్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మల్లారెడ్డి తెలిపారు. 
కేసీఆర్ ఇటీవల పలుమార్లు ఏఐజీ ఆస్పత్రిలో టెస్టులు చేయించుకున్నారు.  నందినగర్ నివాసంలో మూడు రోజుల పాటు ఉండి.. పరగడుపున చేయించుకోవాల్సిన టెస్టులను చేయించుకున్నారు. వయసు కారణంగా వచ్చిన కొన్ని సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  



కేసీఆర్ మళ్లీ ప్రజా సమస్యలపై పోరాటానికి రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు  కసరత్తు చేస్తున్నారు. బనకచర్ల ఇష్యూతో పాటు ప్రాజెక్టుల అంశంపై ఇటీవల అధ్యయనం చేస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రాజెక్టుల అంశాన్ని టేకప్ చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్.. రజతోత్సవ సభలో మాత్రమే ప్రసంగించారు. పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.