KCR Nanded  :  మార్పు మ‌హారాష్ట్ర నుంచే ప్రారంబిద్ధాం.. క‌లిసి రండ‌ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ తొలి సారిగా శిక్షణ తరగతులను ప్రారంభించింది. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌  ప్రారంభించారు. ద‌శాబ్దాల కాలం పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి ఏమి చేసిందని ప్రశ్నించారు. చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా అభివృద్ది చెందాయన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. మహారాష్ట్రలో వారానికోసారి తాగు నీరు వస్తుందంటూ.. పుష్కలంగా నీరు ఉన్నా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు.


దేశం మొత్తం మార్పు తీసుకురావాడానికే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని కేసీఆర్ ప్రకటించారు.  స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక పరిష్కరించామన్న కేసీఆర్.. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు.  మహారాష్ట్రలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కర్నాటక ఫలితాలు వచ్చిన తరువాత ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికి మహారాష్ట్ర నాంది కావాలని స్పష్టం చేశారు. రైతులు ఎల్లకాలం పోరాటాలు చేస్తూ బలికావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద దేశంలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టకూడదని ప్రశ్నలేవనెత్తారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా తెలంగాణ మాడల్‌ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిందని, విద్వేష రాజకీయాలు చేసిన బీజేపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని చెప్పారు. కర్ణాటక ఫలితాల తర్వాత కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని, వారి కలలు కల్లలే అవుతాయని అన్నారు.


 రెండు రోజుల శిక్షణ అనంతరం నియోజకవర్గాలవారీగా పార్టీ ప్రచార సామగ్రి.. కరపత్రాలు, గులాబీ కండువాలు, టోపీలు, వాల్‌పోస్టర్లను పార్టీ బాధ్యులకు కేసీఆర్ అందజేశారు. వాటితోపాటు నెలరోజులపాటు చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన పుస్తకాలను కూడా నియోజకవర్గాలవారీగా పంపిణీ చేశారు. మహారాష్ట్ర స్థానిక కళా సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన పాటలు, వివిధ కళారూపాలకు సంబంధించిన సాంస్కృతిక బాండాగారాన్ని సైతం పెన్‌డ్రైవ్‌ల రూపంలో అందజేశారు. 


శిక్షణ శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్‌ వేదిక మొత్తం గులాబీ మయమైంది. నాందేడ్‌ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. శిక్షణ శిబిరం ద్వారా పలువురు ఇతర పార్టీల ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కడదాకా నిలబడి పోరాడే సత్తా ఉన్నవాళ్లు మాత్రమే బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలన్నారు. పార్టీలో చేరేవాళ్లకు ప్రజల కోసం ఎంతవరకైనా పోరాడే తెగువ ఉండాలని, నిత్యం ప్రజలతో మమేకమై వారిని చైతన్యపర్చాలని సూచించారు. ఒకసారి అడుగు ముందుకు వేస్తే వెనుకడుగు వేసేది లేదని చెప్పారు. మన లక్ష్యం గొప్పదని, త్వరలోనే పార్టీ కమిటీలు నియమించుకుందామని అన్నారు.