Telangana Latest News: తెలంగాణ అసెంబ్లీలో బుధవారం జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. తన తల్లిని, తనను ఎందుకు ఆ రోజు పట్టించుకోలేదని అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.


‘‘సరే రేవంత్ అన్న, మీరు 2019 సంవత్సరంలో మేం నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ బాద అయితే? ఆరోజు మీ కనుల ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మిమ్మల్ని మేము పార్టీలోకి తీసుకువచ్చాం అని అక్కసుతో నన్ను, మా అమ్మని నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు, వాళ్ళు నన్ను, మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు మీరు ఎక్కడికి పోయారు అన్నా?


అందరికీ నోరారా 'మా అన్న రేవంత్ అన్న' అని చెప్పుకున్న నన్ను, నాకు అవసరం ఉన్నప్పుడు ఒక అండగా ఉండాల్సిన సమయంలో నన్ను అనాథగా వదిలి వెళ్ళింది మీరు కాదా అన్నా? 2018 సంవత్సరంలో నా రాజకీయ భవిష్యత్ కోసం ఒక మాట సహాయం చేయండి అన్నా అని వేడుకుంటే, "నా చేతిలో ఏమి ఉంది" అని చెప్పి నాగుండెకు మానలేని గాయం చేసింది మీరు కాదా అన్న?


పార్టీలు మారినా ఎప్పుడూ మీరూ, వదినమ్మ బాగుండాలి అని కోరుకున్న వాళ్ళం మేము, మీ నాశనము ఎప్పుడు కోరుకోలేదు మేము. బాధ అనేది మీకు ఎంత కలిగిందో దానికి రెట్టింపు బాధ నాకు కలిగింది అన్నా. ఎవరికి ఎవరు మోసం చేశారు, ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగింది అనేది ఆ దేవుడికి తెలుసు అన్నా’’ అని కార్తీక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.